Farmers: అన్నదాతకు ఆసరా
ABN , Publish Date - May 06 , 2026 | 01:02 AM
రైతులకు చేదోడువాదోడుగా నిలుస్తున్న యాంత్రీకరణ ప్రక్రియ మంగళవారం నుంచి మొదలైంది. కూలీల కొరతను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నాళ్లుగా యంత్రపరికరాలను అందిస్తున్నాయి.
ఈనెల 19వరకూ దరఖాస్తుల స్వీకరణ
చిత్తూరు సెంట్రల్, మే 5(ఆంరఽధజ్యోతి): రైతులకు చేదోడువాదోడుగా నిలుస్తున్న యాంత్రీకరణ ప్రక్రియ మంగళవారం నుంచి మొదలైంది. కూలీల కొరతను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నాళ్లుగా యంత్రపరికరాలను అందిస్తున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ-సబ్ మిషన్ కింద ఈ ఏడాది ఖరీ్ఫకు ముందే పరికరాలను సమకూర్చేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. యంత్రాలపై సబ్సిడీకి కోసం ప్రభుత్వం జిల్లాకు రూ.2.23 కోట్లు విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం, జిల్లా వ్యవసాయ శాఖలు కార్యచరణ ప్రణాళిక రూపకల్పనకు కమిటీని ఏర్పాటు చేశాయి. ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని 1,18,386 మంది రైతులు 1,78,262 ఎకరాల్లో 22 రకాల పంటల సాగు చేయనున్నారు. సాగు ఆధారంగా రైతులకు ఎలాంటి పరికరాలు కావాలో వివరాలు సేకరించాలని మండల వ్యవసాయధికారులకు వ్యవసాయ జిల్లా స్థాయి అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
దరఖాస్తుల స్వీకరణ మొదలు
రైతులు యంత్రాలు, పరికరాల కోసం ఆన్లైన్/ రైతు సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్లలో కనీసం మూడు సీజన్లలో పంట వివరాలను ఈ-పంట నమోదు చేసుకున్న రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ఆర్హులు. 2024-25లో సబ్సిడీ పొందినవారు అర్హులు కారు. కుటుంబంలో ఒక సభ్యుడు వ్యవసాయ యాంత్రీకరణ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు, మహిళా రైతులకు యూనిట్ ధరలో 50 శాతం, ఇతరులకు 40 శాతం రాయితీ ఇస్తారు. వ్యవసాయ రైతులకు 9 రకాల పరికరాలను సబ్సిడీపై అందించనుంది. ట్రాక్టర్ పనిముట్లు, విత్తడం, నాటడం, తవ్వే యంత్రాలు, స్ర్పేయర్లు, స్వీయ చోదక ఇంప్లిమెంట్స్, 40 హెచ్ఎపీ లోపు ట్రాక్టర్, మినీ ట్రాక్టర్, ఫవర్ టిల్లర్లు, హార్వెస్టింగ్, నూర్పిడి యంత్రాలు, ఎండుగడ్డి, మేత సామగ్రిని ఇవ్వనుంది.
సాగు యంత్రాల షెడ్యూల్ ఇలా...
సబ్సిడీ పరికరాల కోసం మంగళవారం నుంచి రైతుల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 19 వరకు వీటిని స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. ఈనెల 20 నుంచి 23 వరకు పరికరాల విషయంలో మార్పులు చేర్పులకు అవకాశమిస్తారు. 23 నుంచి 25 వరకు లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. 26 నుంచి జూన్ 9 వరకు రైతు తన వాటా మొత్తాన్ని చెల్లించాలి. ఈనెల 26 నుంచి జూన్ 26 వరకు వ్యవసాయ శాఖ యంత్రాలను, పరికరాలను విడుదల చేస్తుంది. వీటికి సంబంధించి జూన్ 30 నుంచి ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేస్తుంది.
లాటరీ పద్ధతిలో ఎంపిక : మురళి, జాయింట్ డైరెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ
పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. అన్ని మండలాల్లో, ఆయా మండలాలు, సామాజిక వర్గాల వారీగా లాటరీ ప్రక్రియ నిర్వహిస్తాం. జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదం తర్వాత లబ్ధిదారుల తుదిజాబితా విడుదల చేస్తాం.