Exam: ఒకరికి బదులు మరొకరు పరీక్షకు
ABN , Publish Date - Aug 21 , 2026 | 01:12 AM
ఒకరికి బదులుగా మరొకరు పదవ తరగతి పరీక్షలను రాసిన కేసులో ఏడుగురు నిందితులకు మూడేళ్ల జైలు, రూ.38వేల జరిమానా విధిస్తూ వెంకటగిరి కోర్టు జడ్జి విష్ణువర్మ తీర్పు చెప్పారు.
వెంకటగిరి టౌన్, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి):ఒకరికి బదులుగా మరొకరు పదవ తరగతి పరీక్షలను రాసిన కేసులో ఏడుగురు నిందితులకు మూడేళ్ల జైలు, రూ.38వేల జరిమానా విధిస్తూ వెంకటగిరి కోర్టు జడ్జి విష్ణువర్మ తీర్పు చెప్పారు.పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిత్ కథనం మేరకు.... వెంకటగిరి బాలికల ఉన్నత పాఠశాలలో 2018వ సంవత్సరంలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో షేక్ నస్రీన్కు బదులుగా షేక్ అఫ్రీన్ పరీక్షలు రాస్తుండగా సూపరింటెండెంట్ పట్టుకున్నారు. దీంతో ఆమె తల్లిదండ్రులు షేక్ కాలేషా, షేక్ చేనాపర్విన్ ఛీఫ్ సూపరింటెండెంట్తో గొడవ పడ్డారు. అలాగే మరో గదిలో దొడ్డా వెంకటరమణమ్మకు బదులుగా బుడతాటి స్వర్ణ పరీక్షలు రాస్తుండగా ఛీఫ్ సూపరింటెండెంట్ పట్టుకున్నారు. వీరికి మాగాటి రత్నయ్య అనే టీచర్ సహకరించినట్లు అదే రోజు వెంకటగిరి పోలీసులకు పరీక్షల ఛీప్ సూపరింటెండెంట్ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి కోర్టుకు తుది నివేదిక సమర్పించారు. వాదోపవాదాలు ముగిసి గురువారం ఈ కేసుకు సంబంధించి తీర్పు వెలువడింది.షేక్ అఫ్రీన్, బుడతాటి స్వర్ణలతోపాటు వారిద్దరి తల్లిదండ్రులకు, టీచర్ రత్నయ్యకు మూడేళ్ల జైలు, రూ.38వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.