పోలీసు యూనిఫాంలో ప్రైవేటు సెక్యూరిటీ!
ABN , Publish Date - Aug 12 , 2026 | 07:31 AM
పోలీసులు ధరించే యూనిఫాంను, వారు వినియోగించే వాకీటాకీలను ఇతరులు.. ముఖ్యంగా ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలు వినియోగించకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ.. తమకు అవేవీ పట్టవన్నట్టుగా వైసీపీ నాయకులు వ్యవహరించారు.
చంద్రగిరి సెక్యూరిటీ సంస్థపై కేసు నమోదు
స్టేషన్ ముందు వైసీపీ నేతల ధర్నా.. పోలీసులతో వాగ్వాదం
చంద్రగిరి, (ఆంధ్రజ్యోతి): పోలీసులు ధరించే యూనిఫాంను, వారు వినియోగించే వాకీటాకీలను ఇతరులు.. ముఖ్యంగా ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలు వినియోగించకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ.. తమకు అవేవీ పట్టవన్నట్టుగా వైసీపీ నాయకులు వ్యవహరించారు. మెగాడీఎస్సీపై సోమవారం చంద్రగిరిలో చేపట్టిన ర్యాలీలో ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ సిబ్బంది కొందరికి సఫారీ దుస్తులు, మరికొందరికి పోలీసు యూనిఫాం తొడిగి, వాకీటాకీలు సమకూర్చి నియమించుకున్నారు. దీనిపై విమర్శలు రావడంతో పోలీసులు ఆరా తీశారు. తిరుపతి రూరల్ మండలం పాడిపేటకు చెందిన రాజు సెక్యూరిటీ ఏజెన్సీ కొందరిని ర్యాలీకి భద్రత నిమిత్తం పంపినట్టు గుర్తించి, సంస్థ యజమాని సతీశ్కుమార్ అలియాస్ సత్య, మరికొందరిపై కేసు నమోదు చేసి మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన వైసీపీ నాయకులు చంద్రగిరి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి తనయుడు హర్షిత్రెడ్డి పోలీసులతో వాదనకు దిగారు. ర్యాలీలో ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకొంటే తప్పేముందని ప్రశ్నించారు. కార్మికులు ఖాకీ యూనిఫాం వేసుకోవడంలేదా, తాము పెట్టుకున్న సిబ్బంది పోలీస్ బ్యాడ్జి కానీ, సింబల్ కానీ పెట్టుకున్నారా? అని నిలదీశారు. సీఐ సురేశ్కుమార్ ఎంతచెప్పినా వినకపోవడంతో డీఎస్పీ ప్రసాద్, పాకాల సీఐ చిన్నగోవిందం, అదనపు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వైసీపీ శ్రేణులు ధర్నా విరమించకపోవడంతో బలవంతంగా వారిని స్టేషన్ లోపలికి తరలించి. కాసేపటి తర్వాత పంపేశారు.
ఇవి కూడా చదవండి
వైసీపీ పట్ల భవిష్యత్లో జాగ్రతగా ఉండకపోతే.. తీవ్ర ఇబ్బందులు: మంత్రి అచ్చెన్న
ఓటు తొలగించటంపై వ్యంగ్యంగా స్పందించిన ప్రకాశ్ రాజ్