సునీల్ భారతి మిత్తల్తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ డిజిటల్ ప్రగతిపై ఫోకస్
ABN , Publish Date - Jun 28 , 2026 | 09:23 PM
ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిత్తల్తో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని సీఎం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
అమరావతి, జూన్ 28: అమరావతిలో సునీల్ భారతి మిత్తల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిత్తల్తో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు లాస్ట్-మైల్ ఇంటర్నెట్ సేవలను విస్తరించే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అలాగే రాష్ట్రంలో మొబైల్ టవర్ కనెక్టివిటీని పెంచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులను ప్రోత్సహించే అవకాశాలు, సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు వంటి కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. మొబైల్ సేవల సంస్థలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మరింత మెరుగుపరిచే చర్యలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారు.
రాష్ట్రంలో ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతి పౌరుడికి నాణ్యమైన ఇంటర్నెట్, మెరుగైన కమ్యూనికేషన్ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ సమావేశం రాష్ట్రంలో డిజిటల్ రంగ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు కొత్త అవకాశాలను తెరచే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
రామమందిర నిధుల దుర్వినియోగం.. సంపన్నులుగా మారిన నిందితులు!
ముందు చేసేయాలి.. ఆ తర్వాతే అందరికీ చెప్పాలి: శుభాంశు శుక్లా