కేసీ కెనాల్ వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి టీజీ టీజీ భరత్
ABN , Publish Date - Sep 18 , 2026 | 07:45 PM
కర్నూల్ జిల్లాలోని కేసీ కెనాల్ వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. ఈ మేరకు భక్తుల మనోభావాలను గౌరవిస్తూ.. కేసీ కెనాల్ వద్దనే నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
కర్నూల్, సెప్టెంబర్ 18: జిల్లాలోని కేసీ కెనాల్ వద్ద రెండు ఘాట్లలో వినాయక నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశామని.. భక్తులకు అనుకూలమైన ప్రదేశంలో నిమజ్జనం చేయాలని మంత్రి టీజీ భరత్ సూచించారు.
గణేశ్ ఉత్సవ కేంద్ర సమితి నిర్ణయం మేరకు కేసీ కెనాల్ వద్ద నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేశామని మంత్రి భరత్ అన్నారు. నన్నూరు టోల్గేట్ వద్ద హంద్రీనీవాతో పాటు వినాయక ఘాట్ వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. కేసీ కెనాల్లో నీటి ఎద్దడి ఉన్న కారణంగా.. కెనాల్కు రెండు వైపులా గోడలు నిర్మించి ట్యాంక్ తరహాలో నీటిని నిల్వ చేసే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. పంప్హౌస్ నుంచి ప్రతిరోజూ వృథాగా పోతున్న 20 లక్షల లీటర్ల నీటిని వినాయక ఘాట్ వద్ద నిల్వ చేస్తున్నామని ఆయన తెలిపారు.
పెద్ద విగ్రహాలను హంద్రీనీవాలో నిమజ్జనం చేసేందుకు నీటి ప్రవాహం అనుకూలంగా ఉందని మంత్రి వెల్లడించారు. హంద్రీనీవాలో ఇప్పటికే 350కి పైగా విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ నేపథ్యంలో భక్తులు తమకు అనుకూలమైన ప్రాంతంలో గణేష్ నిమజ్జనం చేసుకోవచ్చని అన్నారు. ఇరిగేషన్, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సమన్వయంతో నిమజ్జనానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వినాయక నిమజ్జన కార్యక్రమం సక్రమంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని టీజీ భరత్ విజ్ఞప్తి చేశారు.
Also Read:
ఈగల్ టీమ్ పటిష్ఠ నిఘాతోనే క్రైమ్ రేట్ తగ్గింది: హోం మంత్రి అనిత
అన్ని నియామకాలను స్కాంగా మార్చేశారు.. వైసీపీపై బుద్దా వెంకన్న ఫైర్