మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజుపై కౌంటర్ వేయండి
ABN , Publish Date - Sep 17 , 2026 | 04:08 AM
కల్లుగీత కులాలకు కేటాయించిన మద్యం షాపుల కంటే ఓపెన్ క్యాటగిరీ షాపులకు అధికంగా రెన్యువల్ ఫీజును నిర్ణయించారంటూ దాఖలైన పిటిషన్లపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆ శాఖ కమిషనర్ను ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారాని(18వ తేదీ)కి వాయిదా వేసింది.
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కల్లుగీత కులాలకు కేటాయించిన మద్యం షాపుల కంటే ఓపెన్ క్యాటగిరీ షాపులకు అధికంగా రెన్యువల్ ఫీజును నిర్ణయించారంటూ దాఖలైన పిటిషన్లపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆ శాఖ కమిషనర్ను ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారాని(18వ తేదీ)కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. మద్యం దుకాణాల లైసెన్సుల పునరుద్ధరణలో భాగంగా కల్లుగీత కులాలకు కేటాయించిన షాపుల కంటే ఓపెన్ క్యాటగిరీ షాపులకు అధికంగా రెన్యువల్ ఫీజును విధిస్తూ జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన మద్యం దుకాణాల యజమానులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
వారి తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. ఓపెన్ క్యాటగిరీ షాపులకు, కల్లుగీత కులాలకు రిజర్వ్ చేసిన షాపులకు రెన్యువల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధింపులో భారీ వ్యత్యాసం ఉందన్నారు. ఇది తమ పట్ల వివక్ష చూపడమేనన్నారు. రిజర్వ్డ్ షాపులతో సమానంగా ఓపెన్ క్యాటగిరీ షాపులకు ఫీజులు వసూలు చేసేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. మద్యం షాపు రెన్యువల్ చేసుకోవాలా లేదా అనేది దుకాణాల యజమానుల ఇష్టమని.. తామెవరినీ ఒత్తిడి చేయడం లేదని తెలిపారు. వార్షిక లైసెన్స్ ఫీజులో 38 శాతం మాత్రమే లైసెన్స్ రెన్యువల్ కోసం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ వ్యాజ్యంలో గెలిస్తే వ్యత్యాసం ఉన్న సొమ్మును వెనక్కి పొందే వెసులుబాటు పిటిషనర్లకు ఉంటుందన్నారు. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వొద్దని.. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
ఈ వార్తలనూ చదవండి:
గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య