అన్నమయ్య జిల్లాలో కలకలం.. భార్యపై ప్రేమతో కాలు నరుక్కున్న భర్త
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:08 PM
తన భార్య, ఇద్దరు పిల్లలను వదిలేసి మరో యువకుడితో వెళ్లిపోవడాన్ని ఆ భర్త తట్టుకోలేకపోయాడు. భార్యపై ప్రేమతో తిరిగి ఇంటికి రావాలని ఎంతగానో ప్రాదేయపడ్డాడు.
మదనపల్లి, ఏప్రిల్ 05: తన భార్య, ఇద్దరు పిల్లలను వదిలేసి మరో యువకుడితో వెళ్లిపోవడాన్ని ఆ భర్త తట్టుకోలేకపోయాడు. భార్యపై ప్రేమతో తిరిగి ఇంటికి రావాలని ఎంతగానో ప్రాదేయపడ్డాడు. కానీ, తన గోడు భార్య పట్టించుకోవడం లేదని దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. కొడవలితో తన కాలునే నరుక్కున్నాడు. ఈ హృదయ విదారక ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
మదనపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములుకు పవిత్రతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, కొంత కాలం క్రితం పవిత్రకు మరో యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్త అక్రమసంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే ఆ యువకుడితో కలిసి పరారైంది. భార్య వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీరాములు, పిల్లల భవిష్యత్ కోసం, తన కోసం తిరిగి రావాలని పవిత్రను ఎంతగానో ప్రాదేయపడ్డాడు. అయితే, పవిత్ర నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో, తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న కొడవలితో తన కాలుపై బలంగా వేటు వేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన అతడిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ అతడికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
కొమురం భీం జిల్లాలో వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి.. మరో ఏడుగురి పరిస్థితి విషమం
మత్తు పదార్థాలు సేవిస్తూ అడ్డంగా బుక్కయ్యారుగా..