ఏపీలో ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు!
ABN , Publish Date - Apr 05 , 2026 | 09:51 PM
ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు రోజుల పాటు వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. అటు తీవ్రమైన ఎండలు, ఇటు అకాల వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు రోజుల పాటు వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. అటు తీవ్రమైన ఎండలు, ఇటు అకాల వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దక్షిణ కోస్తా–బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం తో వాతావరణంలో మార్పులు సంభవిస్తాయని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా - బంగాళాఖాతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా మేఘావృతమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమ ప్రాంతంపై మరో ఆవర్తనం కొనసాగుతుండటంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని అధికారుల తెలిపారు. పిడుగులు పడే సమయంలో రైతులు, పశు కాపరులు పొలాల్లో ఉండకూడదని, ముఖ్యంగా చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
కొనసాగుతున్న ఎండల తీవ్రత..
ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ, రాష్ట్రంలో భానుడి భగభగలు తగ్గడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు 40°C దాటాయి. నెల్లూరు, రేణిగుంట ప్రాంతాల్లో గరిష్టంగా 42°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పోలవరం, ఎన్టీఆర్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాష్ట్రంలోని సుమారు 66 మండలాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
సీఎం భార్యకు మూడు పాస్పోర్ట్లు... స్పందించిన హిమంత్ బిశ్వా శర్మ
ఢిల్లీకి తమిళనాడుకు మధ్య జరుగుతున్న ప్రజాస్వామ్య పోరు ఇది: స్టాలిన్