మద్యం పాలసీ రెన్యువల్?
ABN , Publish Date - Aug 11 , 2026 | 06:50 AM
కొత్త మద్యం పాలసీపై కసరత్తు చేసిన ఎక్సైజ్ శాఖ పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రధానంగా పాలసీ రెన్యువల్పైనే చర్చ సాగుతోంది. రెండేళ్ల కిందట షాపుల పాలసీ తీసుకొచ్చినప్పుడు రూ.1900 కోట్లు దరఖాస్తు ఫీజుల రూపంలో వచ్చింది.
పలు కోణాల్లో కొత్త పాలసీపై కసరత్తు
లైసెన్సీలతో రెండు దఫాల చర్చలు
దరఖాస్తు రుసుము కడితే రెన్యువల్!
సీఎం వద్ద సమావేశంలో తుది నిర్ణయం
అమరావతి, (ఆంధ్రజ్యోతి): కొత్త మద్యం పాలసీపై కసరత్తు చేసిన ఎక్సైజ్ శాఖ పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రధానంగా పాలసీ రెన్యువల్పైనే చర్చ సాగుతోంది. రెండేళ్ల కిందట షాపుల పాలసీ తీసుకొచ్చినప్పుడు రూ.1900 కోట్లు దరఖాస్తు ఫీజుల రూపంలో వచ్చింది. 90 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. అయితే అనంతరం చెప్పినంత మార్జిన్ తమకు ప్రభుత్వం ఇవ్వడం లేదని, నష్టాల పాలయ్యామని లైసెన్సీలు గగ్గోలు పెట్టారు. దాదాపు ఏడాది తర్వాత మార్జిన్ను సమీక్షించిన ఎక్సైజ్ శాఖ కొంతమేర పెంచింది. ఈ నేపథ్యంలో కొత్త పాలసీకి వెళ్తే అన్ని దరఖాస్తులు రాకపోవచ్చనే అభిప్రాయం ఉంది. దానివల్ల ప్రభుత్వ ఖజానాకు లోటు ఏర్పడే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. దీంతో కొత్త పాలసీకి కాకుండా ప్రస్తుత లైసెన్సీలతోనే పాలసీ రెన్యువల్ చేయాలనే ప్రతిపాదన సిద్ధం చేశారు. అయితే గతంలో వచ్చిన రూ.1900 కోట్లను లైసెన్స్ ఫీజులుగా చెల్లిస్తే ప్రస్తుత లైసెన్సీలకే రెన్యువల్ చేస్తారు. సగటున చూస్తే పట్టణాల్లో రూ.40 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 లక్షల చొప్పున లైసెన్సీలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. దీనిని ఒక్కసారిగా కాకుండా ఏడాదికి 50 చొప్పున చెల్లించేలా ప్రణాళిక రూపొందించారు. దీనిపై రెండు సార్లు లైసెన్సీలతో చర్చలు జరిపారు. లైసెన్సీలు కూడా చాలామంది రెన్యువల్కు అనుకూలంగానే ఉన్నారు. కొద్ది మంది మాత్రం అంత పెద్దమొత్తం దరఖాస్తు ఫీజు చెల్లించడం తమవల్ల కాదని అంటున్నారు. దీంతోపాటు కొత్తగా మళ్లీ పాలసీకి వెళ్లడంపైనా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మంత్రివర్గ ఉపసంఘం చర్చించిన అనంతరం సీఎం తుది నిర్ణయం తీసుకుంటారు. కాగా, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బార్లను సుదీర్ఘకాలం నుంచి రెన్యువల్ చేస్తూ వచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఆ విధానాన్ని మార్చి కొత్త లైసెన్సీలను ఎంపిక చేసింది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎక్సైజ్ ‘రెన్యువల్’ ప్రతిపాదన తీసుకొచ్చినా కావాలనే అధికార పార్టీ వారికి రెన్యువల్ చేశారని దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
ఫిట్నెస్ కోసం 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్ ఈసారైనా నిరూపించుకుంటాడా?
2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్