ఘోరం.. ఆస్తి కోసం సొంత అన్ననే హతమార్చాడు..
ABN , Publish Date - Apr 12 , 2026 | 10:05 AM
ఆస్తి వివాదాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. అన్న కనికరం లేకుండా రోకలిబండతో మోది దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే..
ఆళ్లగడ్డ, ఏప్రిల్ 12: ఆస్తి వివాదాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. సొంత అన్న అనే కనికరం కూడా లేకుండా.. ఓ తమ్ముడు రోకలిబండతో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఆళ్లగడ్డ మండలం ఆర్. కృష్ణాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్. కృష్ణాపురం గ్రామానికి చెందిన దైవ భక్తుడు (40), అతని తమ్ముడు విజయ రాజు మధ్య కొంతకాలంగా ఆస్తి విషయమై గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే ఆదివారం అన్నదమ్ముల మధ్య వివాదం ముదిరింది. ఆవేశంతో ఊగిపోయిన తమ్ముడు విజయ రాజు.. ఇంట్లోని రోకలిబండతో అన్న దైవ భక్తుడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తలకు బలమైన గాయం కావడంతో దైవ భక్తుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో ఇద్దరు వ్యక్తులపై కూడా విజయ రాజు దాడికి దిగాడు. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నిందితుడు విజయ రాజుపై కేసు నమోదు చేశారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
బెంగాల్లో ‘పౌరస్మృతి’ అమలు చేస్తాం
తమిళనాట.. హోరా హోరీగా ఎన్నికల ప్రచారం