ROAD: తోవ కష్టాలు..!
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:41 PM
వైసీపీ హయాంలో పల్లెల్లో అభివృద్ధి అటకెక్కింది. రోడ్లు అధ్వానంగా మారాయి. మట్టి రోడ్లే దిక్కయ్యాయి. మండలంలోని చాలా గ్రామాలు.. సీసీ రోడ్లకు నోచుకోలేదు. మట్టి రోడ్లలో గ్రామీణులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాలువలు కూడా లేవు. రోడ్లపైనే మురుగు నీరు ప్రవహిస్తోంది. మట్టిరోడ్ల గుంతల్లో ఆ నీరు నిల్వ ఉంటుండడంతో జనం నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు.
పలు గ్రామాల్లో అధ్వానంగా రోడ్లు
నేటికీ మట్టిరోడ్లే దిక్కు - ఇబ్బందులు పడుతున్న గ్రామీణులు
నల్లమాడ, జనవరి 13(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో పల్లెల్లో అభివృద్ధి అటకెక్కింది. రోడ్లు అధ్వానంగా మారాయి. మట్టి రోడ్లే దిక్కయ్యాయి. మండలంలోని చాలా గ్రామాలు.. సీసీ రోడ్లకు నోచుకోలేదు. మట్టి రోడ్లలో గ్రామీణులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాలువలు కూడా లేవు. రోడ్లపైనే మురుగు నీరు ప్రవహిస్తోంది. మట్టిరోడ్ల గుంతల్లో ఆ నీరు నిల్వ ఉంటుండడంతో జనం నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని కుటాలపల్లి, బండవాండ్లపల్లి, ఎస్సీ కాలనీ, చౌటకుంటపల్లి, సుబ్బరాయునిపల్లి, గూడమేకలపల్లి, ఎర్రచెరువుపల్లి, బొగ్గిటివారిపల్లి, కాయలవాండ్లపల్లి, వేళ్లమద్ది, కొండకిందతండా, తిప్పయ్యగారిపల్లి తదిత ర గ్రామాల్లో అరకొర సిమెంటురోడ్లు తప్ప.. మిగిలిన వీధుల్లో మట్టిరోడ్లే దర్శనమిస్తున్నాయి. నల్లమాడ సమీపంలోని బండవాండ్లపల్లిలో సిమెంటురోడ్డు వేసిన దాఖలాల్లేవు. కూటమి ప్రభుత్వమైనా పల్లెల్లో రోడ్లు వేయించాలని జనం కోరుతున్నారు.
సిమెంటు రోడ్డు లేదు..- అంజనరెడ్డి, బండవాండ్లపల్లి
మండలంలోని ఎన బండవాండ్లపల్లిలో ఏ వీధి చూసినా మట్టిరోడ్లే దర్శనమిస్తున్నాయి. సిమెంటు రోడ్డు వేసిన పాపాన పోలేదు. సిమెంటు రోడ్లు వేయాలని అధికారులకు పదేపదే విన్నవిస్తున్నా.. అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప.. ఆ దిశగా చర్యలు చేపట్టట్లేదు.
ప్రధాన వీధి మాత్రమే..- సోముశేఖర్రెడ్డి, కుటాలపల్లి
కుటాలపల్లిలో ప్రధాన వీధి తప్ప.. మిలిగిన వీధుల్లో మట్టిరోడ్లు, బండలపరుపు దర్శనమిస్తాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు గ్రామంలోని వీధులకు సిమెంటురోడ్లు వేయాలి.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....