మంటగలిసిన మాతృత్వం.. కుమార్తెను బలవంతంగా తన ప్రియుడికి అప్పగించిన తల్లి
ABN , Publish Date - Aug 12 , 2026 | 07:06 AM
మాతృత్వం మంట గలిసింది. డబ్బు కోసం కన్నబిడ్డనే ప్రియుడికి అప్పగించింది. వాయివరుసలు మరచి.. తల్లితోపాటు ఆమె కూతురిపైనా కన్నేసిన ఆ ప్రబుద్ధుడు సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు.
అనకాపల్లి టౌన్, (ఆంధ్రజ్యోతి): మాతృత్వం మంట గలిసింది. డబ్బు కోసం కన్నబిడ్డనే ప్రియుడికి అప్పగించింది. వాయివరుసలు మరచి.. తల్లితోపాటు ఆమె కూతురిపైనా కన్నేసిన ఆ ప్రబుద్ధుడు సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి, ఆమె ప్రియుడి తీరుతో మనస్తాపం చెందిన ఆ బాలిక.. ఇంకెందుకు ఈ బతుకు అనుకుని బాత్రూంలు కడిగే రసాయనం తాగేసి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అనకాపల్లి పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇన్చార్జి డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్ మంగళవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తూరు పంచాయతీ శారదానగర్కు చెందిన కూనిశెట్టి భార్గవ ప్రకాశ్ అనకాపల్లిలోని నెయ్యిలవీధి స్వర్ణ వార్డు (సచివాలయం) కార్యాలయంలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అతడు భార్యతో గొడవపడి, కొంతకాలంగా వేరుగా ఉంటున్నాడు. పట్టణంలోని మరో ప్రాంతానికి చెందిన మహిళ.. భర్తతో విభేదాలు రావడంతో ఇంటర్ సెకండియర్ చదువుతున్న కూతురితో కలిసి వేరేగా ఉంటున్నది.
ఏడాది కిందట ప్రకాశ్కు ఆమెతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇదిలా సాగుతుండగానే.. అతడి కన్ను ఆమె కుమార్తెపై పడింది. ‘నీ కూతుర్ని నాతో పంపితే డబ్బులు ఇస్తానని’ తల్లిని ప్రలోభపెట్టాడు. దీంతో కొద్దిరోజుల కిందట కుమార్తెను ప్రకాశ్ వద్దకు తీసుకువెళ్లింది. తల్లి సహాయంతో బాలికపై అత్యాచారానికి పాల్పడిన అతడు.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించాడు. ఈ నెల ఏడో తేదీన మరోసారి తన కుమార్తెను బలవంతంగా శారదానగర్లోని ప్రకాశ్ ఇంటికి తీసుకువెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన బాలిక.. చనిపోవాలని నిర్ణయించుకుని బాత్రూంలు శుభ్రం చేసే రసాయనం తాగేసింది. దీంతో వాంతులు చేసుకుని, స్పృహ తప్పి పడిపోయింది. ఇద్దరూ కలిసి బాలికను ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయమై ఈ నెల 9వ తేదీన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసుకొని, ఫిర్యాదు తీసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన ప్రకాశ్తోపాటు బాలిక తల్లిని కూడా మంగళవారం అరెస్టు చేశారు. ప్రకాశ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ఇన్చార్జి డీఎస్పీ మోహన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్ ముందు ట్రంప్ కొత్త డిమాండ్..
అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు..