ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ABN , Publish Date - Apr 02 , 2026 | 05:53 PM
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందడం పట్ల జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా నేడు అమరావతి ‘అజేయమైన శక్తిగా అవతరించిందని తెలిపారు.
మంగళగిరి, ఏప్రిల్ 2: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గత కొన్నెళ్లుగా రాజధాని ఉనికిపై సాగిన కుట్రలు, అపోహలు, న్యాయపరమైన చిక్కులన్నింటినీ అధిగమించి.. నేడు పార్లమెంట్ సాక్షిగా అమరావతి అజేయమైన శక్తిగా అవతరించిందని చెప్పారు. లోక్సభ అనంతరం రాజ్యసభలోనూ బిల్లు నెగ్గడంతో రాజధానిగా అమరావతికి ఇక ఎదురులేదని, ఇది ఐదు కోట్ల ఆంధ్రులు గర్వించ దగ్గ శుభపరిణామమని అన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్ సభ అమోదం పొందటంతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంలో ఉన్నారు. వారంతా ఎంతో గర్వించే క్షణాలు. ఈ చట్టబద్ధతతో అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుంది. లోక్సభలో ఈ బిల్లుకు మద్దతు తెలియజేసిన ఇతర పార్టీలు, ఎంపీలకు ధన్యవాదాలు. అమరావతికి చట్టబద్ధత లభించడం జీర్ణించుకోలేక విషం చిమ్ముతున్నవారికి రాబోయే రోజుల్లో ప్రజలు గొప్ప గుణపాఠం నేర్పిస్తారు. అమరావతి ఇక అజేయమని, అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. అమరావతి అభివృద్ధికి బలమైన తోడ్పాటు అందిస్తూ, చట్టబద్ధత బిల్లును విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు’. ఈ చరిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పక్షాలు నిర్వహించే సంబరాల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు, పార్టీ కార్యాలయాల వద్ద దీపాలు వెలిగించి అమరావతి విజయోత్సవాన్ని జరుపుకోవాలి’ అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
రాజ్యసభలో బీఆర్ఎస్పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ప్రేమ వివాహం.. నెలరోజులకే సాఫ్ట్వేర్ ఉద్యోగిని సూసైడ్
Read Latest Telangana News And Telugu News