Mahalakshmi Scheme: మహాలక్ష్మి పథకంతో.. 192.50 కోట్ల మంది ప్రయాణం
ABN , Publish Date - Jul 05 , 2025 | 03:29 AM
మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు 192.50 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. తద్వారా వారు రూ.6,436.17 కోట్ల మేర రవాణా చార్జీలను పొదుపు చేసుకున్నారు.
రూ.6,436.17 కోట్ల రవాణా చార్జీల పొదుపు
ఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీప్రక్రియ ప్రారంభం
బీసీలకు అదనంగా రూ.2,971 కోట్లు
ప్రగతి నివేదికలో ప్రభుత్వం వెల్లడి
హైదరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు 192.50 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. తద్వారా వారు రూ.6,436.17 కోట్ల మేర రవాణా చార్జీలను పొదుపు చేసుకున్నారు. గాంధీ భవన్లో శుక్రవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆర్టీసీ, రవాణా, బీసీసంక్షేమ శాఖలు.. సంస్కరణలు, అభివృద్ధిపై ప్రగతి నివేదికను విడుదల చేశాయి. మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికులవాటా 40ు నుంచి 66.56శాతానికి పెరిగింది. పొదుపు సంఘాల ద్వారా 6 వేల కొత్త బస్సులను కొనుగోలు చేయగా.. ఆర్టీసీలో ఖాళీల భర్తీకి 3035 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటి వరకు 781 కారుణ్య నియామకాలు, మెడికల్ ఇన్వాలిడేషన్ స్కిమ్ కింద 277 నియామకాలను చేపట్టారు. 2023 డిసెంబరు నుంచి మొత్తం 2,194 కొత్త బస్సులు సంస్థలో ప్రవేశ పెట్టారు.
హైదరాబాద్లో 275 ఇంట్రా సిటీ, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, సూర్యాపేటలో 146 ఇంటర్ సిటీ విద్యుత్తు బస్సులను ఈ ఏడాది చివరినాటికి ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్లో డీజిల్ బస్సుల స్థానంలో 2,800 ఈవీ బస్సులను ప్రవేశపెడతారు. మరోవైపు.. వాహనాలు నడిపే సమయంలో నిబంధనలు అతిక్రమించే వారిపై రవాణా శాఖ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అతివేగం, మాదక ద్రవ్యాలు తీసుకుని వాహనాలను నడిపిన 18,973 మంది డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేశారు. ఈవీ పాలసీలో భాగంగా.. జూలై 1 వరకు నమోదైన 42,348 వాహనాలకు రూ.311.07 కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చారు. కాగా.. బీసీల అభ్యున్నతికి గత ఏడాది కంటే.. ఈసారి అదనంగా రూ.2,971.32 కోట్లను విడుదల చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ విడుదల చేసిన ప్రగతి నివేదిక గుర్తుచేసింది. గీతకార్మికులు, విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ చార్జీలపెంపు, హస్టళ్లకు పక్కా భవనాల నిర్మాణం, బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్కు కేటాయింపులు, రజక, నాయీ బ్రాహ్మణ కులాలకు ఉచిత విద్యుత్తు పథకం, గురుకులాల్లో 5,136 ఖాళీల భర్తీ గురించి తన నివేదికలో వివరించింది.
ఇవి కూడా చదవండి
స్టాక్ మార్కెట్లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్పై సెబీ చర్యలు
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి