Selfie Accident: 2 నెలల క్రితమే పెళ్లి సెల్ఫీ దిగుదామని చెప్పి.. భర్తను నదిలోకి తోసిన భార్య
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:41 AM
ఆ దంపతులకు రెండు నెలల క్రితమే వివాహమైంది. కొత్త జంట అత్తారింటి నుంచి భర్త గ్రామానికి బైక్పై బయలుదేరింది. దారిలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణా నది చూడముచ్చటగా కనిపించింది.
బ్రిడ్జి నుంచి పడి వరదలో కొట్టుకెళ్లిన బాధితుడు
రాళ్లపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్న వైనం
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఘటన
కృష్ణ, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఆ దంపతులకు రెండు నెలల క్రితమే వివాహమైంది. కొత్త జంట అత్తారింటి నుంచి భర్త గ్రామానికి బైక్పై బయలుదేరింది. దారిలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణా నది చూడముచ్చటగా కనిపించింది. దీంతో అక్కడ సెల్ఫీ దిగుదామని భర్తను భార్యను కోరింది. కాదనలేక బ్రిడ్జిపై బైక్ నిలిపిన భర్త.. ఫొటో దిగేందుకు భార్య పక్కన చేరాడు. సెల్ఫీ క్లిక్మని అన్నదో లేదో.. అనూహ్యంగా బ్రిడ్జిపై నుంచి భర్తను నదిలో తోసేసింది భార్య. సెల్ఫీ పేర భార్య చేసిన ఈ అఘాయిత్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కర్ణాటక లోని దేవసూగూరు గ్రామానికి చెందిన తాతప్ప తన భార్య సుమంగళతో కలిసి ద్విచక్ర వాహనంపై భార్య స్వగ్రామం లింగసూగూరు నుంచి బయలుదేరాడు. నారాయణపేట జిల్లా సరిహద్దు కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా కడలూరు గ్రామ శివారులోని కృష్ణానదిపై ఉన్న గుర్జాపూర్ రోడ్ కం బ్యారేజ్ వద్దకు రాగానే సెల్ఫీ దిగుదామని భర్తను భార్య కోరింది. దీంతో బైక్ను పక్కన నిలిపి వచ్చాడు తాతప్ప.
ఈ క్రమంలో సెల్ఫీ దిగుతుండగా భర్తను నదిలోకి తోసింది సుమంగళ. నీటిలో కొట్టుకుపోయిన తాతప్ప.. ఈదుకుంటూ మధ్యలో ఉన్న బండరాళ్లపైకి వెళ్లాడు. అక్కడ నిలబడి సహాయం కోసం కేకలు వేశాడు. దీంతో బ్రిడ్జిపై వెళుతున్న యువకులు అతడిని గమనించారు. అతడిని లాగేందుకు తాడు తెచ్చారు. సుమారు 100 మీటర్ల దూరంలో నది మధ్యలో రాళ్లపై ఉన్న తాతప్పకు అందేలా బ్రిడ్జిపై నుంచి తాడును వేశారు. ఆ తాడును అతడు నడుముకు కట్టుకోగా.. యువకులు బ్రిడ్జి పైకి లాగి రక్షించారు. సెల్ఫీ దిగుదామని అనడంతో.. భార్య తనను చంపడానికి సిద్ధంగా ఉందని అప్పటికే అనుమానం వచ్చిందని తాతప్ప ఆవేదన వ్యక్తంచేశాడు. అతడి భార్య మాత్రం ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడని చెబుతోంది. అనంతరం భార్యాభర్తలిద్దరూ కలిసి బైక్పై దేవసూగూరుకు వెళ్లారు.