Warangal Bathukamma: వెయ్యి స్తంభాల గుడిలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Sep 21 , 2025 | 07:46 PM
వరంగల్ వెయ్యి స్తంభాల ఆలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు జూపల్లి, పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించారు.
వరంగల్, సెప్టెంబర్ 21: వరంగల్ వెయ్యి స్తంభాల ఆలయంలో బతుకమ్మ సంబరాలు ఇవాళ(ఆదివారం) ఘనంగా ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించారు. పూల జాతరకు భారీగా మహిళలు తరలివచ్చారు. బతుకమ్మ సంబరాల నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
ప్రకృతి పండగ బతుకమ్మని.. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని కోరుకుంటున్నాని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మహిళలు దీవించాలని ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఏకం చేసింది బతుకమ్మ పండుగ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 'గతంలో మన సంస్కృతిని గుర్తించలేదు, ధ్వంసం చేశారు. బతుకమ్మకు రెండు వందల ఏళ్ల చరిత్ర ఉంది' అని జూపల్లి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని మహిళలు దీవించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తోందని తెలిపారు.
ఏడాదికొకసారి వచ్చే బతుకమ్మకు చాలా చరిత్ర ఉందని మంత్రి సీతక్క అన్నారు. 'కాకతీయుల కాలం నుంచి బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాం. చెరువులకు మొక్కుకునే ఆనవాయితీ మనది. ఆడబిడ్డలు కష్టసుఖాలు పంచుకునే సందర్భం బతుకమ్మ. మన పండుగలకు సైంటిఫిక్ రీజన్ ఉంది. పూర్వీకులు ఇచ్చిన ఆచారాలు, సంప్రదాయాలు కాపాడుకుందాం' అని సీతక్క అన్నారు.
తెలంగాణ పచ్చగా ఉండాలని మహిళలు దీవించాలని మంత్రి కొండా సురేఖ కోరారు. కనివిని ఎరుగని రీతిలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా కొండా సురేఖ 'చిత్తూ చిత్తూల బొమ్మ' అంటూ బతుకమ్మ పాట పాడగా.. మంత్రి సీతక్క, ఎంపీ కావ్య, మేయర్ గుండు సుధారాణి, గద్దర్ కూతురు వెన్నెల, మహిళలు కోరస్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి