Uttam: ఏపీ నీటి దోపిడీకి బీఆర్ఎస్ మద్దతు
ABN , Publish Date - May 05 , 2025 | 04:30 AM
ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీకి బీఆర్ఎస్ ప్రభుత్వమే మద్దతు పలికిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు.
కృష్ణా నది నుంచి 512 టీఎంసీలు తరలించుకోపోతున్నా పట్టించుకోలేదు
న్యాయమైన వాటాకు సర్కారు పోరాటం
ఎస్ఎల్బీసీ పనులపై నిపుణుల కమిటీ
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మిర్యాలగూడ/తిరుమలగిరిరూరల్/హుజూర్నగర్ /కోదాడ, మే 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీకి బీఆర్ఎస్ ప్రభుత్వమే మద్దతు పలికిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. 2014 నుంచి 2023 వరకు కృష్ణానది నుంచి ఏపీ ఏటా 512 టీఎంసీల నీటిని తరలించుకుపోతుంటే బీఆర్ఎస్ సర్కారు చోద్యం చూసిందన్నారు. ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి ఉత్తమ్ పర్యటించి నీటిపారుదల, పౌరసరఫరాల శాఖలపై సమీక్షలు నిర్వహించడంతో పాటు కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లోని 80 శాతం భూములకు సాగర్ ఎడమ కాల్వ ద్వారా సాగు నీరు అందుతుండగా బ్రిజేష్ ట్రైబ్యునల్ సూచనల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను 811 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉందన్నారు. మూడింట రెండొంతుల నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతల్లో కనీస స్పందన కూడా లేకుండా పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు కృష్ణా నీటిలో తెలంగాణ న్యాయమైన వాటా కోసం పోరాడుతోందన్నారు. 811 టీఎంసీల్లో 70 శాతం తెలంగాణకు, 30 శాతం ఏపీకి కేటాయించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం బలంగా వాదనలు వినిపిస్తోందని చెప్పారు.
ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడమే లక్ష్యం
ప్రతి ఎకరాకు నీరు అందించటమే ప్రభుత్వ లక్ష్యమని ఉత్తమ్ అన్నారు. అన్ని ప్రాజెక్టుల్లో పూడికతీత పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఎస్ఎల్బీసీ పనులను కొనసాగించడానికి నిపుణుల కమిటీని వేసి వారి సూచనల మేరకు టన్నెల్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. డిండి ప్రాజెక్టు పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు మెదలుపెట్టామన్నారు. గత సీజన్లో 153.58 లక్షల మెట్రిక్ టన్నులు.. ఈ యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు పండించారని, మొత్తం ఏడాదిలో 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. పేదల కడుపు నింపేందుకే కాంగ్రెస్ సర్కారు సన్నబియ్యం పంపిణీని చేపట్టిందని చెప్పారు.
జన్మనిచ్చిన తాటిపాములను మరిచిపోను..
తనకు జన్మనిచ్చిన గ్రామం తాటిపాములను ఏనాడూ మర్చిపోనని మంత్రి ఉత్తమ్ అన్నారు. తాటిపాములలో రూ.20 కోట్లతో నిర్మించే యశ్వంతాపూర్ వాగుపై చెక్డ్యాం, ఇతర అభివృద్ధి పనుల శంకుస్థాపనకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావులతో కలిసి హాజరయ్యారు. దేవాదుల చివరి ప్యాకేజీ నుంచి చెన్నూరు రిజర్వాయర్ నుంచి తాటిపాముల మీదుగా తిరుమలగిరికి సాగునీటిని తరలిస్తామని ఉత్తమ్ తెలిపారు. తన చిన్నతనంలో ఆ వాగుపై ఆడుకున్నానని గుర్తుచేసుకున్నారు. గ్రామంలో ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి రూ.కోటి, ప్రాథమిక పాఠశాలకు రూ.కోటి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ పూర్తయితే నల్లగొండ జిల్లా సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. కార్యక్రమాల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎంపీలు రఘువీర్రెడ్డి, కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జైవీర్రెడ్డి, బాలునాయక్, రాజగోపాల్రెడ్డి, అనిల్కుమార్రెడ్డి, పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్ చౌహాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..
AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..
Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..