Share News

ఆర్‌ అండ్‌ బీ చీఫ్‌ ఇంజనీర్‌ అడ్మిన్‌గా ఎస్‌.తిరుమల బాధ్యతలు

ABN , Publish Date - Feb 01 , 2025 | 04:19 AM

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం చీఫ్‌ ఇంజనీర్‌గా (సీఈ, అడ్మిన్‌) ఎస్‌.తిరుమలను నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు.

ఆర్‌ అండ్‌ బీ చీఫ్‌ ఇంజనీర్‌ అడ్మిన్‌గా ఎస్‌.తిరుమల బాధ్యతలు

హైదరాబాద్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం చీఫ్‌ ఇంజనీర్‌గా (సీఈ, అడ్మిన్‌) ఎస్‌.తిరుమలను నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం తిరుమల చీఫ్‌ టెక్నికల్‌ ఎగ్జామినర్‌ (సీటీఈ) బాధ్యతల్లోనూ ఉన్నారు. ఇప్పటివరకు ఆర్‌ అండ్‌ బీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌, అడ్మిన్‌ సీఈ పోస్టులో ఉన్న పి.మధుసూదన్‌రెడ్డి శుక్రవారమే పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం అడ్మిన్‌ సీఈ పోస్టును భర్తీ చేసిన ప్రభుత్వం.. శాఖలో కీలకమైన ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) పోస్టును ఖాళీగానే ఉంచింది. ఇందుకు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రావడమే కారణంగా కనిపిస్తోంది. మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది.


శాఖలోని రూరల్‌ రోడ్ల విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ పోస్టులో ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌గా ఉన్న డి.శ్యామ్‌కుమార్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. అలాగే ఎస్సీ ఎస్‌డీఎఫ్‌, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ బాధ్యత కూడా అప్పగించారు. ప్రస్తుతం ప్లానింగ్‌, టెర్రిటోరియల్‌ ఇన్‌చార్జ్‌ సీఈగా ఉన్న టి.జయభారతికి వామపక్ష తీవ్రవాద ప్రాంతాల బాధ్యతలను, బిల్డింగ్స్‌ ఇన్‌చార్జ్‌ సీఈగా ఉన్న బి.రాజేశ్వరరెడ్డికి రైల్వే భద్రత పనులు సహా మరికొన్ని బాధ్యతలను అప్పగించారు. టెర్రిటోరియల్‌-2, నాణ్యత విభాగం చీఫ్‌ ఇంజనీర్‌గా ఉన్న జి.చిన్నపుల్లదా్‌సకు టెండర్ల కమిషనరేట్‌ సభ్యుడిగా బాధ్యతలు కట్టబెట్టారు. ఆర్‌ అండ్‌ బీలోని జాతీయ రహదారుల (ఎన్‌హెచ్‌)విభాగానికి కూడా ప్రభుత్వం పూర్తిస్థాయి అధికారిని నియమించలేదు. ప్రస్తుతం ఈ పోస్టు కూడా ఖాళీగానే ఉంది.

Updated Date - Feb 01 , 2025 | 04:19 AM