Share News

సేవాలాల్‌ జయంతిని అధికారికంగా నిర్వహించాలి

ABN , Publish Date - Feb 13 , 2025 | 04:07 AM

బంజారాల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని దేశ వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సేవాలాల్‌ జయంతిని అధికారికంగా నిర్వహించాలి

  • కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ బీజేపీ ఎంపీల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): బంజారాల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని దేశ వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గోడం నగేష్‌, రఘునందన్‌రావు, డీకే అరుణ తదితరులు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఎంపీల వెంట ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ కూడా ఉన్నారు.


ఈ సందర్భంగా బీజేపీ ఎంపీలు తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. 15వ తేదీన సేవాలాల్‌ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. కాగా, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో భేటీ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జోగులాంబ ఆలయం, కురుమూర్తి, మన్నెంకొండ, మల్దకల్‌ తిమ్మప్ప దేవాలయాల అభివృద్ధికి నిధులివ్వాలని ఎంపీ డీకే అరుణ కోరారు.

Updated Date - Feb 13 , 2025 | 04:07 AM