Share News

Telecom Industry: స్విచాఫ్‌.. నెట్‌వర్క్‌ బిజీ..!

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:41 AM

టెలికాం రంగంలో గత 3 దశాబ్దాల్లో విప్లవాత్మక మార్పులు చూశాం..! పేజర్ల నుంచి సెల్‌ఫోన్‌ శకానికి చేరుకు న్నాం. 2జీ.. 3జీ.. 4జీని అధిగమించి ఇప్పుడు ఐదోత రం 5జీ మొబైల్‌ నెట్‌వర్క్‌ వినియోగిస్తున్నాం.

Telecom Industry: స్విచాఫ్‌.. నెట్‌వర్క్‌ బిజీ..!

  • ‘హలో.. హలో’ అంటుండగానే కట్‌ అవుతున్న కాల్‌ !

  • సెల్‌ సిగ్నల్స్‌ సమస్యతో తీవ్ర ఇబ్బందులు

  • మాట్లాడుతూ ఉండగానే కాల్‌ డ్రాప్‌.. జంప్‌

  • మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టని కంపెనీలు

  • సెల్‌ ఆపరేటర్లకు జరిమానాలు విధించే అవకాశం అయినా.. పట్టించుకోని టెలికాం నియంత్రణ సంస్థ

స్నేహితుల దినోత్సవం నాడు మాదాపూర్‌లోని బంటీ కూకట్‌పల్లిలోని తన మిత్రుడు చంటికి శుభాకాంక్షలు చెప్పేందుకు ఫోన్‌ చేసినా ఎంతకీ కలవలేదు. నెట్‌వర్క్‌ రెస్పాన్స్‌ లేదు. బిజీనా? కాల్‌ వెయిటింగా? అనే సమాచారం లేకుండానే.. కాసేపటికి కాల్‌ కట్‌ అయిపోయింది. చాలా సార్లు ప్రయత్నిస్తేగానీ, చంటీకి ఫోన్‌ కలవలేదు..!

ఓ పెళ్లికి హాజరైన ఓ పెద్దాయన.. అక్కడ తీసిన ఓ వీడియోను కుటుంబ వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేశారు. 5జీ మొబైల్‌ ఫోన్‌ అయినా.. అపరేటర్‌ డాటా ప్యాకేజీలో ఉన్నా.. ఆ వీడియో అప్‌లోడ్‌ అవ్వడానికి చాలా సమయం పట్టింది..!

ఇవి మొబైల్‌ ఫోన్‌ యూజర్లు ఎదుర్కొంటున్న నెట్‌వర్క్‌ కష్టాలకు చిన్నచిన్న ఉదాహరణలు మాత్రమే..! గతంలో వేర్వేరు ఆపరేటర్ల మధ్య కాల్‌ సమస్యలుండేవి.. ఇప్పుడు ఒకే ఆపరేటర్‌ పరిధిలోనూ ఆ ఇబ్బందులు తప్పడం లేదని సెల్‌ యూజర్లు వాపోతున్నారు.

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): టెలికాం రంగంలో గత 3 దశాబ్దాల్లో విప్లవాత్మక మార్పులు చూశాం..! పేజర్ల నుంచి సెల్‌ఫోన్‌ శకానికి చేరుకు న్నాం. 2జీ.. 3జీ.. 4జీని అధిగమించి ఇప్పుడు ఐదోత రం 5జీ మొబైల్‌ నెట్‌వర్క్‌ వినియోగిస్తున్నాం..! 6జీ వైపు వడివడిగా ముందుకు సాగుతున్నా.. సెల్‌ ఆపరేటర్లు ఆదాయంపై ఉన్న శ్రద్ధ మౌలిక వసతులపై లేకపోవడంతో సగటు వినియోగదారుడు నెట్‌వర్క్‌ సమస్యలతో సతమతమవుతున్నాడు. పూర్తి స్థాయి లో 5జీ సేవలకవసరమయ్యే టవర్లు, చానళ్లను ఏ ర్పాటు చేసుకోని సెల్‌ ఆపరేటర్లు.. కనీసం 4జీ స్థా యి సేవలూ అందించలేకపోతున్నారు. హైదరాబాద్‌ నడిబొడ్డున కూడా సిగ్నల్స్‌ అందక పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది. హైటెక్‌సిటీతోపాటు.. ఐటీ కారిడార్‌లోని మాదాపూర్‌, కొండాపూర్‌ల్లోనే ఈ పరిస్థితి ఉంటే.. గ్రామాల్లో సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.


ఇవీ ప్రధాన సమస్యలు

సిగ్నల్‌ అందకపోవడంతోపాటు.. పలు నెట్‌వర్క్‌ సమస్యలు వినియోగదారులను పట్టిపీడిస్తున్నాయి. ఫోన్‌ మాట్లాడుతుండగా.. మధ్యలోనే కాల్‌ కట్‌.. లేదంటే.. కాల్‌ జంప్‌ అవుతుంది. మళ్లీ ప్రయత్నిస్తే.. క్రాస్‌ కాలింగ్‌ (ఇంకెవరికో కాల్‌ వెళ్లడం) జరుగుతోంది. లేదంటే.. ఉన్నఫళంగా కాల్‌ కట్‌అయ్యి.. ఇంకెవరో మాట్లాడే మాటలు వినిపిస్తుంటాయి. కాల్‌ డ్రాపింగ్‌ సమస్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లోని వారికి కాల్‌ చేస్తే.. ఎంతకీ కలవకపోవడం మరో రకం సమస్య..! బహుళ అంతస్తు లు, ఆకాశ హార్మ్యాల్లోని వారికి నెట్‌వర్క్‌ సమస్యలు మరీ తీవ్రం గా ఉన్నాయి.


కారణాలనేకం..!

ఏడాది కాలంగా నెట్‌వర్క్‌ సమస్యలు తీవ్రమవ్వడానికి పలు కారణాలున్నాయని టెలికాం రంగ నిపుణులంటున్నారు. డాటా, 5జీ సేవలు, కాల్‌ క్వాలిటీ, ఆఫర్లు, ఈ-సిమ్‌ సదుపాయం.. ఇలా వేర్వేరు కారణాలతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ నెట్‌వర్క్‌ల సిమ్‌కార్డులను వాడుతుండటంతో.. రాష్ట్ర జనా భా కంటే.. సెల్‌ వినియోగదారుల సంఖ్య ఎక్కువ. అధికారికంగా రాష్ట్రంలో 4.15 కోట్ల మంది సెల్‌ వినియోగదారులు ఉండగా.. ఇతర రాష్ట్రాల్లో సిమ్‌కార్డు తీసుకున్న, రాష్ట్రంలో.. ముఖ్యంగా హైదరాబాద్‌లోని వారి సంఖ్య లక్షల్లో ఉంటుందని అంచనా..! దీంతో.. నెట్‌వర్క్‌పై భారం పెరిగి.. సిగ్నల్‌ సమస్యలు వస్తుంటాయి. ఉదాహరణకు.. సెల్‌టవర్లు పలు రకాలు. వాటి సాంకేతిక ఫ్రీక్వెన్సీలను బట్టి 2/2/2, 4/4/4, 8/8/8.. అని పిలుస్తుంటారు. మొదటి రకం సెల్‌టవర్‌కు ఒకేసారి 2000 మంది యూజర్లు మాట్లాడుకునే సామర్థ్యం ఉంటుంది. ఆ సంఖ్యను దాటి ఒక్కరు కాల్‌ చేసినా.. సిగ్నల్‌ సమస్యలొస్తా యి. రెండో రకం సెల్‌టవర్‌ పరిధిలో ఏకకాలంలో 3 వేల మంది, మూడోరకం పరిధిలో 4వేల మంది మాట్లాడుకోవచ్చు. 3జీ నెట్‌వర్క్‌కు ముందు టవర్ల లో ఎస్సెమ్మెస్‌, డాటా, కాలింగ్‌కు వేర్వేరు చానళ్లుం డేవి. 3జీ నెట్‌వర్క్‌ నుంచి ఆ సమస్య లేకున్నా.. యూజర్ల పెరుగుదలతో ఇబ్బందులొస్తున్నాయని నిపుణుల మాట. రద్దీ ప్రాంతాల్లో ఆపరేటర్లు మరిన్ని టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఖర్చుకు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది.


రెవెన్యూకు అనుగుణంగా?

వినియోగదారులు పెరుగుతున్నా.. దానికి తగ్గట్టు యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌(ఏఆర్‌పీయూ) పెరగకపోవడంతోనే సెల్‌ ఆపరేటర్లు నిర్వహణను గాలికొదిలేసినట్లు తెలుస్తోంది. 2015-16కు ముందు ఏఆర్‌పీయూ అనేది నిర్ణీత లక్ష్యానికంటే ఎక్కువగా ఉండేది. డాటా ప్లాన్లతో పోటీతో యూజర్లు పెరిగి, సిగ్నళ్ల సమస్యలు క్రమంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. 2015-16లో సగటు ఏఆర్‌పీయూ రూ.300 ఉంటే క్రమంగా తగ్గుతూ.. ప్రస్తుతం రూ.174.46 కు చేరినట్లు ట్రాయ్‌ గణాంకాలు చెబుతున్నాయి. 2015-16కు ముందు కాల్స్‌/డాటాకు వేర్వేరు ప్యాకేజీలుండేవి. ఉదాహరణకు బీఎ్‌సఎన్‌ఎల్‌లో నెలకు 2జీబీ డేటాకు నిర్దేశించిన ప్లాన్‌ కోసం రూ.444 చెల్లిస్తే 2016 తర్వాత పరిస్థితి మారింది. ఇప్పుడు రోజుకు 1.5 నుంచి 2జీబీ చొప్పున డాటా, అపరిమిత కాల్స్‌, 100 ఎస్సెమ్మె్‌సలతో ప్యాకేజీలకు నెలకు రూ.200 లోపే ఖర్చవుతోంది. పోటీని తట్టుకునేందుకు టారీ్‌ఫలను తగ్గించిన కంపెనీలు.. కస్టమర్లు పెరిగాక.. అందుకనుగుణంగా వసతులను కల్పించడం లేదంటున్నారు. యూజర్లకు కాల్స్‌ కనెక్ట్‌ అవ్వకుంటే.. వైఫైతో వాట్సాప్‌ కాల్స్‌ చేసుకుంటారనే ధోరణిలో సెల్‌ ఆపరేటర్లు ఉన్నట్లు ఆరోపిస్తున్నారు.


జరిమానాలు వేయొచ్చు..

కాల్‌డ్రాప్స్‌ సమస్యలపై నెట్‌వర్క్‌ కంపెనీలకు జరిమానాలను విధించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. అయితే.. ఆ దిశలో చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. వినియోగదారులు కూడా కాల్‌ సమస్యలున్నప్పుడు సర్దుకుపోతున్నారే తప్ప.. సెల్‌ సంస్థలకు ఫిర్యాదు చేయడం లేదు. సెల్‌ సంస్థలు పట్టించుకోకుంటే.. ట్రాయ్‌కి ఫిర్యాదు చేయవచ్చు. అక్కడా సమస్యకు పరిష్కారం దొరకలేదనుకుంటే.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌(డీవోటీ)కి ఫిర్యాదు చేస్తే.. సెల్‌ సంస్థలు వినియోగదారుల ఇళ్లకు పరుగులు పెట్టి, సమస్యను పరిష్కరిస్తాయి. లేదంటే.. ఆయా సంస్థలకు జరిమానాలు తప్పదు.


ఈ వార్తలు కూడా చదవండి..

టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్..

కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..

ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 04 , 2025 | 04:41 AM