High Court: రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల వసూళ్ల విప్లవం
ABN , Publish Date - Oct 24 , 2025 | 07:16 AM
రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల వసూళ్ల విప్లవం సాగుతోందంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
న్యాయవాదులూ ఆలోచించాలి: హైకోర్టు
రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల వసూళ్ల విప్లవం సాగుతోందంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇష్టారాజ్యంగా చేపడుతున్న అక్రమ నిర్మాణాలతో భవిష్యత్తుకు ముప్పు వాటిల్లుతుందని, అలాంటి కేసులు వాదించే ముందు న్యాయవాదులు కూడా ఒకసారి ఆలోచించాలని సూచించింది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పర్వతపురంలో 175 గజాల్లో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ బీ సంజీవ్కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగానే అక్రమ నిరాణాలపై ధర్మసనం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రణాళికకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాల కారణంగా పార్కింగ్ లేమి వంటి సమస్యలు తలెత్తుతుండడంతో ఇరుగు పొరుగు మధ్య సఖ్యత లేకుండా పోతోందని తెలిపింది. జీ+2 నిర్మాణానికి అనుమతి తీసుకుని మరో రెండు అంతస్తులు అక్రమంగా ఎలా నిర్మిస్తారని అక్రమ నిర్మాణదారును ప్రశ్నించింది. పిటిషనర్, అక్రమ నిర్మాణదారు అన్నదమ్ములని న్యాయవాది చెప్పడంతో ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ఆస్తి వివాదాలు ఉన్నాయి కాబట్టే ఈ ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించింది. కాలానుగుణంగా విప్లవాలు వస్తుంటాయని, ఇప్పుడు అక్రమ నిర్మాణాల వసూళ్ల విప్లవం సాగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి కేసుల విషయంలో అధికారులు, న్యాయవాదులు ఆలోచించాలని సూచించింది. అక్రమ నిర్మాణాలు సమస్యలు తెచ్చిపెడుతాయని, భవిష్యత్తు తరాలు వీటిని క్షమించవని తెలిపింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం దరఖాస్తులతో 2,863 కోట్ల ఆదాయం
విమానాల్లో పవర్ బ్యాంకులపై నిషేధం
Read Latest Telangana News and National News