BC Reservation: స్థానిక ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్లు
ABN , Publish Date - Jul 28 , 2025 | 03:10 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ.. దీనికి ముడిపడి ఉన్న 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సోమవారం మంత్రివర్గ భేటీలో కీలక చర్చ జరగనుంది.
నేటి మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ
ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర.. బిల్లులు కేంద్రం వద్ద..
ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించి నిర్ణయం?
కులగణన, రేషన్కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష
కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక అందితే దానిపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం!
హైదరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ.. దీనికి ముడిపడి ఉన్న 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సోమవారం మంత్రివర్గ భేటీలో కీలక చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 సెక్షన్ 285(ఎ)ను సవరిస్తూ గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ రాజ్భవన్లోనే ఉంది. అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ బిల్లులపై ఏ నిర్ణయమూ వెలువడలేదు. మరోవైపు రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది. ఏడాదిన్నరకు పైగా స్థానిక ఎన్నికలు జరగక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. వీటన్నింటి నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై మంత్రివర్గం చర్చించనున్నట్టు తెలిసింది.
రిజర్వేషన్ల విషయంలో జాప్యం జరుగుతుండటంతో.. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయమేదైనా తీసుకునే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కులగణనపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ.. ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీనిపై మంత్రివర్గ భేటీలో చర్చించి.. నివేదికలోని వివరాలను వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాలు, కులాల వారీగా ఇచ్చిన ర్యాంకులను బట్టి ఏయే చర్యలు తీసుకోవాలనేదానిపైనా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. పలు ప్రభుత్వ శాఖల్లో కొన్ని పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలిసింది.
యూరియా నిల్వలు.. సాగునీటి ప్రాజెక్టులపై..
ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత నెలకొందని, తగినంత సరఫరా చేయడం లేదని ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అవసరానికి తగిన మేర యూరియా ఇవ్వడంలేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో అసలు రాష్ట్రానికి ఖరీఫ్, యాసంగి సీజన్లలో ఎంతెంత యూరియా అవసరం? ప్రస్తుత ఖరీఫ్కు కేంద్రం ఎంత కేటాయించింది? ఇప్పటివరకు ఎంత సరఫరా చేసింది? యూరియా నిల్వల విషయంలో తీసుకోవాల్సిన చర్యలేమిటన్న అంశాలపై మంత్రివర్గం సమీక్షించనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, సీతారామ ప్రాజెక్టు సవరించిన అంచనాలపై చర్చించనున్నట్టు తెలిసింది.
ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ఏర్పాటైన పీసీ ఘోష్ కమిటీ.. ప్రభుత్వానికి నివేదిక అందజేసే అవకాశం ఉందని సమాచారం. మంత్రివర్గ భేటీకి ముందే నివేదిక అందితే దానిపైనా లోతుగా చర్చించనున్నట్టు తెలిసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వానలు, జలాశయాల్లో నీటి నిల్వ, కొత్త రేషన్కార్డులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనుసంధానం, మైనింగ్ శాఖలో కీలకమైన సీనరేజీ చార్జీల్లో పలు మార్పులు, అధునాతన గోశాలల నిర్మాణంపై మంత్రివర్గంలో సమీక్షించనున్నారు. పటాన్చెరు సిగాచి పరిశ్రమ ప్రమాదంపై విచారణ కమిటీ తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని, దానిపై చర్చించే అవకాశం ఉందని తెలిసింది.
ఇవి కూడా చదవండి...
గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం
కంబోడియా, థాయ్లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి