Share News

Sircilla: సిరిసిల్లలో కాంగ్రెస్‌ X బీఆర్‌ఎస్‌

ABN , Publish Date - May 27 , 2025 | 04:22 AM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ప్రొటోకాల్‌ వివాదం సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. సిరిసిల్లలోని కేటీఆర్‌ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫొటో పెట్టాలంటూ కాంగ్రెస్‌ నాయకులు.

Sircilla: సిరిసిల్లలో కాంగ్రెస్‌ X బీఆర్‌ఎస్‌

  • కేటీఆర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఫొటో పెట్టాలని కాంగ్రెస్‌ డిమాండ్‌

  • రేవంత్‌రెడ్డి ఫొటోతో కార్యాలయం వద్దకు రాక

  • అడ్డుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

  • ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి

సిరిసిల్ల, మే 26 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ప్రొటోకాల్‌ వివాదం సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. సిరిసిల్లలోని కేటీఆర్‌ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫొటో పెట్టాలంటూ కాంగ్రెస్‌ నాయకులు.. రేవంత్‌రెడ్డి ఫొటోతో అక్కడికి రావడం, వారిని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. కొద్దిరోజులుగా.. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే అయిన కేటీఆర్‌ ఫొటోను పెట్టడం లేదంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు నిరసన తెలుపుతున్నారు. అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదంటూ ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. దీంతో కేటీఆర్‌ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు.


ఈ క్రమంలో సోమవారం కేటీఆర్‌ క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సీఎం, తెలంగాణ తల్లి విగ్రహాల ఫొటోలతో క్యాంపు కార్యాలయం వద్దకు తరలివచ్చారు. అక్కడ ముందస్తుగానే పికెట్‌ ఏర్పాటు చేసిన పోలీసులు.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగానే బీఆర్‌ఎస్‌ నాయకులు తరలివచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులకు గాయాలయ్యాయి. దీంతో కాంగ్రెస్‌ నాయకుల తీరు, పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ వారు రోడ్డుపై బైఠాయించారు. ఇరు వర్గాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని వేర్వేరు పోలీ్‌సస్టేషన్లకు తరలించారు. కాగా, బీఆర్‌ఎస్‌ నాయకులపై లాఠీచార్జి చేయడం హేయమైన చర్య అని కరీంనగర్‌ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.


Also Read:

సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..

సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..

For More Health News and Telugu News..

Updated Date - May 27 , 2025 | 04:22 AM