Sangareddy: గజగజ
ABN , Publish Date - Jan 05 , 2025 | 04:24 AM
రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకి అధికమవుతోంది. ముఖ్యంగా రాత్రి పూట అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో శనివారం ఉదయం 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
సంగారెడ్డి జిల్లా కోహీర్లో 6 డిగ్రీలు
ఈ సీజన్లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు
సిర్పూర్లో 6.1 డిగ్రీలు
రాష్ట్రంలో విజృంభిస్తోన్న చలిపులి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకి అధికమవుతోంది. ముఖ్యంగా రాత్రి పూట అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో శనివారం ఉదయం 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే. కోహీర్లో గత ఏడాది ఇదే రోజున 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. కోహీర్లో 6 డిగ్రీలు, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో 6.1, తిర్యాణి మండలం గిన్నెధరిలో 6.2, అదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 6.2, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 6.3, కామారెడ్డి జిల్లా దొంగ్లి మండలం 6.8, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో 6.8, షాబాద్ మండలం చందనవల్లిలో 6.8, అదిలాబాద్ జిల్లా బేల మండలంలో 6.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దాదాపు 15 జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పది డిగ్రీలలోపునకు పడిపోయాయి. మరోవైపు, రాష్ట్రంలో పలు జిల్లాల్లో శీతలగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం హెచ్చరించింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో శనివారం శీతల గాలులు వీచాయని తెలిపింది. అలాగే రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుయ్యే అవకాశం ఉందని చెప్పింది. అలాగే, రాబోయే ఐదు రోజులు పలు జిల్లాల్లో ఉదయం వేళ పొగ మంచు ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది.