Share News

Hyderabad: పదేపదే మూత్రవిసర్జనకు ‘ఐటీఇండ్‌’తో చెక్‌

ABN , Publish Date - Mar 01 , 2025 | 05:24 AM

పదేపదే మూత్ర విసర్జన సమస్యతో సతమతమవుతున్న ఓ రోగి సమస్యను హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు అరుదైన శస్త్రచికిత్స ద్వారా పరిష్కరించారు.

Hyderabad: పదేపదే మూత్రవిసర్జనకు ‘ఐటీఇండ్‌’తో చెక్‌

  • బ్లాడర్‌ నెక్‌ వద్ద ప్రత్యేక పరికరం ఏర్పాటుతో సమస్యకు పరిష్కారం

  • హైదరాబాద్‌లోని ఏఐఎన్‌యూలో ఓ రోగికి ఆ పరికరాన్ని అమర్చిన వైద్యులు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): పదేపదే మూత్ర విసర్జన సమస్యతో సతమతమవుతున్న ఓ రోగి సమస్యను హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు అరుదైన శస్త్రచికిత్స ద్వారా పరిష్కరించారు. రోగి బ్లాడర్‌ హెడ్‌ వద్ద ఐటీఇండ్‌ అనే పరికరాన్ని అమర్చి ఉపశమనం కల్పించారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి మూత్రవిసర్జనకు చాలా ఇబ్బంది పడుతున్నారు. పదేపదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావ డం, తీరా వెళ్లాక సరిగా విసర్జన కాకపోవడం, మళ్లీ బ్లాడర్‌ నిండుగా ఉన్నట్లు అనిపించడం తదితర సమస్యలతో సతమతమవుతున్నాడు. ఈ తరహా సమస్యను ‘ప్రైమరీ బ్లాడర్‌ నెక్‌ అబ్‌స్ట్రక్షన్‌ (పీబీఎన్‌ఓ)’ అంటారని యూరాలజిస్టు డాక్టర్‌ మద్దూరి విజయ్‌ కుమార్‌ శర్మ తెలిపారు. ఈ పీబీఎన్‌ఓ సమస్య పరిష్కారానికి రోగి మూత్రనాళంలో బ్లాడర్‌ నెక్‌ వద్ద ఐటీఇండ్‌ అనే ఆధునిక పరికరాన్ని అమర్చామని చెప్పారు. ఐటీఇండ్‌ పరికరం ప్రోస్టేట్‌ను, బ్లాడర్‌ నెక్‌ను తెరుస్తుందని, బ్లాడర్‌ నెక్‌ వద్ద మూత్రం సులభంగా పోయేందుకు వీలుగా మూడుచోట్ల ఛానల్స్‌ ఏర్పాటవుతాయని వివరించారు. ఈ పరికరం అమర్చిన ఐదు నుంచి 7 రోజుల్లో మూత్రనాళంలో మూసుకుపోయిన ప్రాంతాన్ని తెరుస్తుందన్నారు. అనంతరం ఈ పరికరాన్ని తొలగిస్తామని తెలిపారు. కాగా, ఐటీఇండ్‌ అమరిక వల్ల లైంగిక సామర్థ్యం తగ్గడం వంటి దుష్ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ఈ తరహా సమస్యలకు సంప్రదాయ చికిత్సల్లో ప్రొస్టేట్‌ను కొంత తొలగిస్తామని, అందువల్ల వీర్యస్ఖలనం సామర్థ్యం పోవచ్చునన్నారు. కానీ, ఐటీఇండ్‌లో కోతలే ఉం డవు కనుక లైంగిక సామర్థ్యం అలాగే ఉంటుందని చెప్పా రు. ఈ శస్త్రచికిత్స చేయించుకున్న రోజునే రోగి ఆస్పత్రి నుంచి వెళ్లిపోవచ్చునని విజయ్‌కుమార్‌ శర్మ పేర్కొన్నారు.


ఎక్కువ సేపు మూత్రం లోపలే ఉంటే కిడ్నీలకు ముప్పు

మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 55 ఏళ్లలోపు పురుషుల్లో 35 -45 శాతం మందికి పీబీఎన్‌ఓ ఉంటుందని డాక్టర్‌ మద్దూరి విజయ్‌ కుమార్‌ శర్మ తెలిపారు. దిగువ మూత్రనాళ లక్షణాలు (ఎల్‌యూటీఎస్‌) ఉన్నవారికీ పీబీఎన్‌ఓ ఎక్కువగానే కనిపిస్తుందని అన్నారు. పురుషులు రోజులో నాలుగైదు సార్లు మూత్రానికి వెళ్తే, ఈ సమస్య ఉన్నవారు ప్రతి గంటకీ వెళ్లాల్సి వస్తుందన్నారు. ఎక్కువ సేపు మూత్రం లోపలే ఉంటే మూత్రపిండాలు దెబ్బతినే ముప్పు ఉందని, ఈ తరహా సమస్య ఉన్న వారు వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Updated Date - Mar 01 , 2025 | 05:24 AM