Rare Earth Elements: సింగరేణి మట్టి బంగారమే!
ABN , Publish Date - Jul 05 , 2025 | 04:39 AM
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఇటీవల చైనా దిగుమతులపై పన్నులు పెంచారు ట్రంప్ పన్నులు పెంచినప్పుడల్లా అమెరికా దిగుమతులపై చైనా కూడా అదే స్థాయిలో పెంచింది.
ఓపెన్ కాస్ట్ మట్టిలో అరుదైన స్కాండియం, స్ట్రోంచియం
ఇవే కాకుండా మరో 14 రకాల అరుదైన మూలకాలు
మరిన్ని పరిశోధనలకు సీఎస్ఐఆర్తో ఒప్పందం
ఆగస్టు నుంచి వెలికితీతకు సింగరేణి ముమ్మర సన్నాహాలు
15 టన్నుల మట్టిలో కిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉండే అవకాశం
కొత్తగా 30 లక్షల టన్నుల అరుదైన ఖనిజాల వెలికితీతకు ప్రణాళిక
మాగ్నెట్లు, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీల తయారీల్లో ఇవే కీలకం
తాజా పరిణామాలతో భారత్ మూడో స్థానానికి చేరుకునే చాన్స్
(భూపాలపల్లి, ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఇటీవల చైనా దిగుమతులపై పన్నులు పెంచారు! ట్రంప్ పన్నులు పెంచినప్పుడల్లా అమెరికా దిగుమతులపై చైనా కూడా అదే స్థాయిలో పెంచింది! ఒకరికొకరు పోటాపోటీగా 200 శాతానికిపైగా అలా పెం చుకుంటూ పోయారు! చివరకు, అమెరికాయే దిగి రావాల్సి వచ్చింది! పన్నులను తగ్గించాల్సి వచ్చింది! ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి.. చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న అత్యంత అరుదైన ఖనిజాలు! ఆ ఖనిజాల సరఫరా ఆపేసినా.. పన్నులు పెంచినా అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమే! మరి, అటువంటి అరుదైన ఖనిజాలు భారత్లో మరీ ముఖ్యంగా తెలంగాణలో పెద్దఎత్తున లభిస్తే..!? అది కూడా ఎందుకూ పనికిరాదని భావించిన మట్టి నుంచి వీటిని వెలికి తీయవచ్చని తెలిస్తే..!? ఇప్పుడు అదే జరిగింది! సింగరేణిలో వృథా అనుకున్న ఓపెన్ కాస్టు ఓవర్ బర్డెన్(మట్టి) బంగారు బాతులా మారబోతోంది. ఉపరితల గనుల తవ్వకాలతో గుట్టల్లా పోగుపడిన ఆ మట్టిలో ప్రపంచంలోనే అత్యంత అరుదుగా లభించేస్కాండియం, స్ట్రోంచియం, ఎట్రియం, సీరియం వంటి భూ మూలకాలు(రేర్ ఎర్త్ ఎలిమెంట్స్- ఆర్ఈఈ) బయటపడ్డాయి. ఇక్కడ 14 రకాల అత్యంత అరుదైన భూ మూలకాలు ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. వీటిని ప్రపంచ మార్కెట్లో అత్యంత విలువైన, అరుదైన మూలకాలుగా గుర్తించిన సింగరేణి.. లోతైన అధ్యయనం కోసం కేంద్ర బొగ్గు గనుల శాఖకు నివేదించింది. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వాటి సాంద్రతను తేల్చేందుకు పరిశోధనల బాధ్యతను పలు ఏజెన్సీలకు అప్పగించింది. సాధారణంగా 150-220పీపీఎం స్థాయిలో అరుదైన ఖనిజాలు ఉంటాయి. అయితే, కొత్తగూడేం జిల్లా మణుగూరు బ్లాక్లోని దుర్గంగుట్ట గనుల్లో 266.21 పీపీఎం స్థాయిలో అరుదైన ఖనిజాలున్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. లోతైన అన్వేషణ చేసి ఆగస్టు నుంచి ఈ ఖనిజాల వెలికితీతకు సింగరేణి సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు ఐఐటీ హైదరాబాద్, నాన్ ఫెర్రస్ మెటీరియల్ టెక్నాలజీ డెవల్పమెంట్ సెంటర్ (ఎన్ఎ్ఫటీడీసీ) వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.
వందల టన్నుల్లోనే..
సింగరేణిలో కోట్ల టన్నుల ఓవర్ బర్డెన్ ఉంటుందని అంచనా. అయితే, ఖమ్మం జిల్లా సత్తుపల్లి, పెద్దపల్లి జిల్లా రామగుండం, మంచిర్యాల ప్రాంతాల్లో జరిపిన మట్టి నమునాల పరీక్షల్లో 15 టన్నుల మట్టి నుంచి కిలో అరుదైన ఖనిజాలు లభించే అవకాశం ఉన్నట్టు తేల్చారు. వీటిని ఉమ్మడిగా వెలికి తీయడానికి ఇటీవల డీఆర్డీవో మాజీ డైరెక్టర్ జనరల్, నీతి ఆయోగ్ సభ్యుడు పద్మభూషణ్ డాక్టర్ వీకే సారస్వత్ సమక్షంలో భువనేశ్వర్కు చెందిన సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్(సీఎ్సఐఆర్)తో సింగరేణి సీఎండీ బలరాం ఒప్పందం కుదుర్చుకున్నారు. సీఎ్సఐఆర్, దాని అనుబంధ సంస్థ ఐఎంఎంటీ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ) వీటి అన్వేషణ, వెలికితీతలో కీలక భూమిక పోషించనున్నాయి. ఓపెన్ కాస్టు బొగ్గు గనుల ఓవర్ బర్డెన్తోపాటు బొగ్గు గనుల పై పొరల్లో వెలికి తీసిన రాళ్లలోను అరుదైన ఖనిజాలు ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేనా.. సెంట్రల్ కోల్ ఫీల్ట్స్, ఈశాన్య భారతదేశంలోని బొగ్గు గనుల మట్టి వ్యర్థాలు, రాతి పలకలు, థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి వచ్చే ఫ్లై యాష్లోనూ ఆర్ఈఈలు ఉన్నట్లు కనుగొన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం.. వీటన్నిటిలో కలిపి దాదాపు 30 లక్షల టన్నుల అరుదైన ఖనిజాలు బయటపడే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో, వీటిని వెలికి తీసేందుకు కేంద్రం కూడా ప్రయత్నాలు ప్రారంభించింది.
కీలక పరికరాల తయారీలో..
అద్దాల నుంచి అంతరిక్ష సాధనాల వరకు వివిధ రకాల పరికరాల తయారీలో ఈ అరుదైన మూలకాలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా విద్యుత్తు వాహనాలకు ఉపయోగించే బ్యాటరీలు, మ్యాగ్నెట్లు, ఎలకా్ట్రనిక్స్, విమాన కీలక పరికరాల తయారీ, క్యాథోడ్ రే ట్యూబులు, ఫెర్రో అల్లాయిస్, న్యూక్లియర్ రియాక్టర్లు, వైద్య పరికరాల తయారీ, సిరామిక్, ఆయుధ పరికరాల తయారీలో కీలకంగా వాడతారు. అరుదైన ఖనిజాలు, భూ మూలకాల నిల్వల్లో భారతదేశం ఇప్పటి వరకూ ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉంది. మన దేశంలో సుమారు 13 మిలియన్ టన్నుల నిల్వలు ఉంటాయని అంచనా. ఇప్పుడు సింగరేణిలో రమారమి మూడు మిలియన్ టన్నుల నిల్వలున్నట్టు ప్రాథమికంగా తేల్చారు. దీంతో, భారత్ ప్రపంచంలో మూడో స్థానానికి ఎగబాకుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 21 మిలియన్ టన్నులతో బ్రెజిల్ రెండో స్థానంలో నిలవగా.. చైనా 42 మిలియన్ టన్నుల నిల్వలతో అగ్ర స్థానంలో ఉంది.
ఖనిజాల వెలికితీతకు మరో ఒప్పందం
సింగరేణికి చెందిన కొన్ని ఓసీ గనుల్లో, సింగరేణి ఽథర్మల్ విద్యుత్తు కేంద్రం నుంచి వచ్చే ఫ్లైయా్షలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని గుట్టల్లో ఆర్ఈఈలు ఉన్నట్లు గుర్తించామని, మరింత పరిశోధన చేసి వీటిని వెలికి తీసేందుకు నాన్ ఫెర్రస్ మెటీరియల్ టెక్నాలజీడెవల్పమెంట్ సెంటర్(ఎన్ఎ్ఫటీడీసీ)తో సింగరేణి శుక్రవారం ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డిమాట్లాడుతూ వ్యాపార విస్తరణలో సింగరేణి అగ్రభాగాన నిలవాలని ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి
స్టాక్ మార్కెట్లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్పై సెబీ చర్యలు
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి