Ponnam Prabhakar: రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:12 AM
రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు, స్క్రాప్ పాలసీ, ఈవీ పాలసీలను అమలు చేస్తూ రవాణాశాఖను ముందంజలో ఉంచుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
స్క్రాప్ పాలసీతో కాలుష్య నివారణ: పొన్నం
బీసీ రిజర్వేషన్ల కోసం పొన్నం పోరాడారు: కోమటిరెడ్డి
నల్లగొండ, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు, స్క్రాప్ పాలసీ, ఈవీ పాలసీలను అమలు చేస్తూ రవాణాశాఖను ముందంజలో ఉంచుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నల్లగొండ ఆర్టీసీ బస్ డిపోకు నూతనంగా కేటాయించిన 10 ఎలక్ర్టికల్ బస్సులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. అలాగే, రూ.8కోట్లతో నిర్మించతలపెట్టిన ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ స్క్రాప్ పాలసీని పక్కాగా అమలు చేస్తున్నామని, తద్వారా కాలుష్య నివారణ జరుగుతోందని వెల్లడించారు. తెలంగాణలో 17 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగానే నల్లగొండలో రెండో స్టేషన్కు శంకుస్థాపన చేశామన్నారు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం క్యాబినెట్లో పొన్నం ప్రభాకర్ కొట్లాడారని వివరించారు. రాష్ట్రంలో ఆర్టీసీని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.