Ponguleti Srinivas Reddy: రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు
ABN , Publish Date - May 13 , 2025 | 05:05 AM
రైతులు ఏ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ కార్యాలయాల్లోనే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

రెవెన్యూ ఆఫీసుల్లోనే సమస్యలకు పరిష్కారం: పొంగులేటి
హైదరాబాద్, మే12 (ఆంధ్రజ్యోతి): రైతులు ఏ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ కార్యాలయాల్లోనే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో భూభారతి చట్టం తెచ్చిందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ఈ చట్టం సులువైన మార్గం అని చెప్పారు. భూభారతి చట్టం ప్రయోగాత్మకంగా అమలు చేసిన తొలి దశ నాలుగు మండలాలకు సంబంధించిన జిల్లాల కలెక్టర్లతో సోమవారం సచివాలయం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని నారాయణపేట, ఖమ్మం, కామారెడ్డి, ములుగు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేయాలని.. ఈ నెలాఖరు నాటికి పరిష్కారం చూపాలని సూచించారు. సోమవారం నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసేందుకు తహసీల్దార్లకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. మరోవైపు.. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎప్పటికప్పుడు అర్హుల జాబితాలను ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులకు పంపించి ఆమోదం తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 47 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అందుబాటులో ఉందని మంత్రి పొంగులేటి తెలిపారు. వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అన్ని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో అమల్లోకి తెస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు..
భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచం..
For More AP News and Telugu News