Kavitha: పసుపునకు 15 వేల మద్దతు ధర ప్రకటించాలి
ABN , Publish Date - Jan 20 , 2025 | 05:09 AM
పసుపునకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.15 వేలుగా ప్రకటించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్
నిజామాబాద్, జనవరి 19(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పసుపునకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.15 వేలుగా ప్రకటించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం తరపున నిర్వహించిన పసుపు బోర్డు ప్రారంభోత్సవంలోకేంద్ర ప్రభుత్వం కనీస ప్రొటోకాల్ పాటించలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను పిలువకుండానే ప్రారంభోత్సవం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం బీజేపీ ప్రజాప్రతినిధులనే ఆహ్వానించారని ఆమె విమర్శించారు.
ఈమేరకు ఆదివారం నిజామాబాద్లో కవిత విలేకరులతో మాట్లాడారు. పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు పూర్తిగా మేలు జరగదని, మద్దతు ధర ప్రకటించడంతో పాటు దిగుమతులు నియంత్రించినప్పుడే పసుపు రైతులకు మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు కోసం అలుపెరగని పోరాటం చేశానని, అప్పుడు ఎంపీ అర్వింద్ రాజకీయాల్లోనే లేరని అన్నారు. ఎంపీగా గెలిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని అర్వింద్ బాండ్ పేపర్ రాసి ఇచ్చారని, గెలిచిన తర్వాత పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డు బాగుంటుందన్నారని చెప్పారు.