Cement Corporation of India: ఆదిలాబాద్ సీసీఐ ప్లాంటును కేంద్రమే పునరుద్ధరించాలి
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:13 AM
మూతపడిన ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ప్లాంటును పునరుద్ధరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం
మంత్రి శ్రీధర్బాబు
2 వేల కోట్లు అవసరమన్న సీసీఐ సీఎండీ
పూర్తి వ్యయం కేంద్రమే భరించాలన్న మంత్రి
పునరుద్ధరణపై సచివాలయంలో సమీక్ష
హైదరాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : మూతపడిన ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ప్లాంటును పునరుద్ధరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ పరిశ్రమను తిరిగి నడిపించాలని సీఎం రేవంత్ రెడ్డి, తాను పలు సందర్భాల్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిసి కోరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సీసీఐ ప్లాంటు పునరుద్ధరణపై సచివాలయంలో మంత్రి సోమవారం నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీసీఐ సీఎండీ సంజయ్ బంగా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పునరుద్ధరణ ప్రతిపాదనలపై శ్రీధర్ బాబు చర్చించారు. ప్లాంటును ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేసి పునరుద్ధరించడానికి రూ. 2 వేల కోట్లు అవసరమవుతాయని సీఎండీ మంత్రికి తెలిపారు. మంత్రి స్పందిస్తూ.. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలోని ఈ భారీ పరిశ్రమను పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వమే పునరుద్ధరించాలని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో కోరిన విషయాన్ని గుర్తుచేశారు. ఇది అందుబాటులోకి వస్తే మూడు వేలమందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు.
రాష్ట్రంలో ‘ఏఐ’ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’ ఏర్పాటు చేసేందుకు ఆస్ర్టేలియాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ‘డికిన్ విశ్వవిద్యాలయం’ ముందుకొచ్చింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో డికిన్ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా ఒప్పందంపై సంతకాలు చేశారు. ‘అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా ఏఐ రంగంలో తెలంగాణను గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం.. ఏఐలో నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుకు డికిన్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకున్నాం’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వాస్తవాలు చెబితే.. తప్పు పట్టిన బీఆర్ఎస్
ఆలయాల అభివృద్ధిపై సమీక్ష.. సీఎం కీలక ఆదేశాలు
For More TG News And Telugu News