Jayesh Ranjan: మిల్లా మాగీ ఆరోపణలు అబద్ధం
ABN , Publish Date - May 26 , 2025 | 05:07 AM
మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణల్లో ఒక్క శాతం కూడా నిజం లేదని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ స్పష్టం చేశారు.
ఆమె పాల్గొన్న ప్రతీ కార్యక్రమం వీడియో స్వయంగా చూశా
ఎవరూ అసభ్యంగా ప్రవర్తించలేదు
బ్రిటన్ పత్రిక కావాలని చేసి ఉండొచ్చు
మిస్ ఇంగ్లండ్ వివాదంపై జయేశ్ రంజన్
పోటీదార్ల నుంచి అభిప్రాయాల సేకరణ
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణల్లో ఒక్క శాతం కూడా నిజం లేదని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ స్పష్టం చేశారు. మిల్లా మాగీ పాల్గొన్న ప్రతి కార్యక్రమం వీడియోను తాను ప్రత్యక్షంగా వీక్షించానని, ఆమెతో ఎవరూ అసభ్యంగా ప్రవర్తించలేదని తెలిపారు. ఆదివారం ఆయన ప్రపంచ సుందరి పోటీదారులను కలసి మాట్లాడారు. హైదరాబాద్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా.. అని ఆరా తీశారు. చౌమహల్లా ప్యాలె్సలో జరిగిన డిన్నర్లో మిల్లా మాగీతో కలిసి టేబుల్ వద్ద కూర్చున్న మిస్ వేల్స్ మిల్లీ మే ఆడమ్స్తో జయేశ్ రంజన్ ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు సేకరించారు. హైదరాబాద్కు వచ్చిన తొలిరోజు నుంచి ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నానని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ అనిపించలేదని జయేశ్ రంజన్తో మిస్ వేల్స్ చెప్పినట్టు తెలిసింది. అనంతరం కొందరు మీడియా ప్రతినిధులతో జయేశ్ రంజన్ మాట్లాడారు.
మిల్లా మాగీని ఎవరూ ఇబ్బంది పెట్టలేదు..
మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ ఆరోపణలు అబద్ధమని జయేశ్ రంజన్ స్పష్టం చేశారు. ‘‘స్పాన్సర్లతో కలివిడిగా ఉండాలని నిర్వాహకులు చెప్పారనడంలో ఒక్కశాతం కూడా నిజం లేదు. ఆమె చౌమహల్లా ప్యాలెస్ డిన్నర్లో మాత్రమే పాల్గొన్నారు. ఆమె కూర్చున్న టేబుల్ వద్ద మిస్ వేల్స్ కూడా ఉన్నారు. కొందరు అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆమెను ఎవరూ ఇబ్బంది పెట్టలేదు. ఆ వీడియోలను నేను స్వయంగా పరిశీలించాను’’ అని చెప్పారు. పేదరికాన్ని చూసి బాధ కలిగిందని మిల్లా మాగీ చెప్పడంలోనూ వాస్తవం లేదని.. హైదరాబాద్లో అన్నం దొరకని వారిని చూశానన్న ఆమె మాటలు తనకు ఆశ్చర్యంగా అనిపించాయని జయేశ్ రంజన్ పేర్కొన్నారు. ఆమె ఇంటర్వ్యూ ఇచ్చిన బ్రిటన్ పత్రికకు.. సంచలనం కోసం డబ్బులిచ్చి తప్పుడు ప్రకటనలు చేయించే చరిత్ర ఉందని ఆరోపించారు. ఈ విషయంలోనూ అదే జరిగి ఉండవచ్చన్నారు. ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేసేవారిని పట్టించుకోబోమని చెప్పారు.
ఇవి కూడా చదవండి
Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్
ponnam prabhakar: తల్లిదండ్రులు వారి పిల్లలను శక్తి మేర చదివించాలి: పొన్నం