KTR: జూరాల గేట్ రోప్ తెగిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:33 AM
గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు గేటు రోప్ తెగిపోవడానికి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
ఇప్పటికైనా సీఎం, మంత్రులు మొద్దునిద్ర వీడాలి: కేటీఆర్
హైదరాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు గేటు రోప్ తెగిపోవడానికి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఒక్క ఇటుక పేర్చడం కూడా చేతకాని ముఖ్యమంత్రికి.. కనీసం ఉన్న ప్రాజెక్టుల నిర్వహణపై శ్రద్ధ పెట్టకపోవడం వల్లే జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని గురువారం ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. ఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్ వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించడంలో రేవంత్ సర్కారు నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జూరాలకు క్రమంగా వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలని సూచించారు. ఇప్పటికే ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్దవాగుకు గండిపడి 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, వట్టెం ప్రాజెక్టు పంప్ హౌజ్ మునిగిపోయిందని తెలిపారు. తాజాగా జూరాల గేట్ రోప్ తెగిపోవడంతోపాటు ఇతర గేట్ల రోప్లు కూడా బలహీనంగా ఉన్నాయని పేర్కొన్నారు. పుణెలో మెట్రో విస్తరణకు ఆమోదం తెలిపిన కేంద్రం.. హైదరాబాద్ మెట్రో విస్తరణను విస్మరించడమేంటనికేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలుండి తెలంగాణకు ఏం లాభం చేకూర్చారని, వారు ఎవరి కోసం పనిచేస్తున్నారని నిలదీశారు. గుజరాత్కు రూ.2 లక్షల కోట్లతో బుల్లెట్ రైళ్లను ఆమోదిస్తారు కానీ హైదరాబాద్లో కనీసం మెట్రో ప్రాజెక్టులను కూడా ఆమోదించరా..? అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News