Share News

KTR: డూప్లికేట్‌ గాంధీల వైఫల్యాలను ఎండగట్టాలి

ABN , Publish Date - Jan 28 , 2025 | 05:12 AM

అధికారం చేపట్టి 13 నెలలైనా హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్‌ సర్కారు పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

KTR: డూప్లికేట్‌ గాంధీల వైఫల్యాలను ఎండగట్టాలి

  • ఈ నెల 31న గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు

  • అపరిచితుడిలా.. సీఎం రేవంత్‌ మాటలు: కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): అధికారం చేపట్టి 13 నెలలైనా హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్‌ సర్కారు పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. అశోక్‌నగర్‌లో తెలంగాణ యువతకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని చెప్పిన రాహుల్‌ గాంధీ మొహం చాటేశారని విమర్శించారు. ఒరిజినల్‌ గాంధీ.. మహాత్మా గాంధీ అని.. ఆయన స్ఫూర్తిగా డూప్లికేట్‌ గాంధీలు ఇచ్చిన దొంగ హామీలు, వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ అవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాలిస్తామని రాహుల్‌ హామీ ఇచ్చి 400 రోజులు గడిచిన సందర్భంగా ఈనెల 31న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గాంధీ విగ్రహాలకు నివాళులర్పించి, వినతిపత్రాలు ఇవ్వాలని విద్యార్థి విభాగానికి సూచించారు.


కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చామని చెప్పుకొంటున్న ఉద్యోగాలన్నీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లవేనని చెప్పారు. రాష్ట్రంలో 12 వేలకుపైగా గ్రామ పంచాయతీలుంటే కేవలం 600గ్రామాల్లోనే పథకాల అమలు చేస్తామంటూ.. స్థానిక సంస్థల్లో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి మానసిక స్థితిపై అనుమానాలు వస్తున్నాయని.. 15నిమిషాల్లోనే మాట మార్చి.. అపరిచితుడు సినిమాలో మాదిరిగా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. రేవంత్‌కు దమ్ముంటే ప్రభుత్వం వచ్చాయంటున్న పెట్టుబడులు ఎప్పటిలోగా వస్తాయో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ పెట్టుబడులన్నీ వాస్తవ రూపం దాల్చితే తామే సీఎంకు సన్మానం చేస్తామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

Ajay Missing: హుస్సేన్‌సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్

Updated Date - Jan 28 , 2025 | 05:12 AM