Koonaneni Sambasivarao: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి కూనంనేని ఎన్నిక
ABN , Publish Date - Aug 23 , 2025 | 05:19 AM
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మరోసారి ఎన్నికయ్యారు.
వరుసగా రెండోసారి బాధ్యతలు
101 మందితో నూతన కార్యవర్గం
హైదరాబాద్/గాజులరామారం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మరోసారి ఎన్నికయ్యారు. మేడ్చల్ జిల్లా గాజులరామారంలో జరిగిన సీపీఐ రాష్ట్ర నాలుగో మహాసభల చివరి రోజు, శుక్రవారం నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని పేరును సీపీఐ సీనియర్ నాయకులు పల్లా వెంకట్రెడ్డి ప్రతిపాదించగా మరో నేత శంకర్ బలపరిచారు. దీంతో కూనంనేని వరుసగా రెండోసారి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అలాగే, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటీ నరసింహ ఎన్నికయ్యారు. 10 మంది కార్యదర్శి వర్గ సభ్యులు, 32 మంది కార్యవర్గ సభ్యులు సహా మొత్తం 101 మందితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన నాయకత్వాన్ని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా అభినందించారు. రాష్ట్రంలో సీపీఐని మరింత బలోపేతం చేసేందుకు కృషి చెయ్యాలని వారు దిశానిర్దేశం చేశారు. కాగా, రాష్ట్ర నూతన కార్యవర్గానికి ఎన్నికైన వారిలో కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, పల్లా వెంకట రెడ్డి, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, బాగం హేమంతరావు, కలవేన శంకర్, ఎం.బాలనరసింహా, వీఎస్ బోస్, ఈటీ నరసింహా, బొమ్మగాని ప్రభాకర్, వి.సీతారామయ్య, పల్లా నర్సింహారెడ్డి, నెల్లికంటి సత్యం, ఎస్కే సాబీర్ పాషా, దండి సురేశ్, సీహెచ్ రాజారెడ్డి, ఎస్ బాల్రాజ్, మందా పవన్, బి.విజయసారధి, కర్రె భిక్షపతి, పాలమాకుల జంగయ్య, ఎన్.జ్యోతి, బెజవాడ వెంకటేశ్వర్లు, ఛాయాదేవి, రామడుగు లక్ష్మణ్, కలకొండ కాంతయ్య, ఈ ఉమా మహేశ్, పంజాల శ్రీనివాస్, ముత్యాల విశ్వనాథం, యానాల దామోదర్ రెడ్డి, షేక్ బాసుమియా ఉన్నారు.
కమ్యూనిస్టు పార్టీకి ఉద్యమాలే ఊపిరి: చాడ
త్వరలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సీపీఐ శ్రేణులు సన్నద్ధం కావాలని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వందేళ్ల చరిత్ర ఉన్న సీపీఐ.. దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయిందనే విమర్శలు ఉన్నా, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటాలు సాగించిందన్నారు. కమ్యూనిస్టు పార్టీకి ఉద్యమాలే ఊపిరి అని, ఎర్రజెండా వద్దకు వస్తే నీడ, నివాసం దొరుకుతాయని పేదల గుండెల్లో గట్టి నమ్మకం ఉందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
లైసెన్సు తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉంచొద్దు... హైకోర్టు కీలక ఆదేశాలు
Read Latest Telangana News and National News