CPI: బీఆర్ఎస్తో కలిసి పని చేసే ఆలోచనే లేదు: కూనంనేని
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:04 AM
బీఆర్ఎ్సతో కలిసి పనిచేసే ఆలోచన సీపీఐకి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, బీఆర్ఎస్ తప్పుడు విధానాల వల్లే రాష్ట్రానికి ఈ గతి పట్టిందన్నారు.

హైదరాబాద్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎ్సతో కలిసి పనిచేసే ఆలోచన సీపీఐకి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, బీఆర్ఎస్ తప్పుడు విధానాల వల్లే రాష్ట్రానికి ఈ గతి పట్టిందన్నారు. శనివారం మగ్దూంభవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రె్సతో స్నేహబంధం కొనసాగిస్తూనే పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూములు అమ్మడం సరికాదని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. యూనివర్సిటీ భూముల విక్రయం వ్యవహారంలో బీజేపీ ఎంపీ ఎవరున్నారో కేటీఆర్ బయట పెట్టాలని డిమాండ్చేశారు. కేంద్రంలోని బీజేపీ పాలనను గాలికి వదిలేసిందని, మత ప్రాతిపదికన విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి వస్తే అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాల్సిందేనని, జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ఎప్పటికి తామే అధికారంలో ఉండేలా కుట్రపన్నుతోందని ఆరోపించారు. కేంద్రం తక్షణం తెలంగాణ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కేంద్రమే కల్పించాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై కవిత బీజేపీతో యుద్ధం చేయాలని సూచించారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా కేంద్రం సిద్ధంగా లేనట్లు వ్యవహరిస్తోందన్నారు.