Komatireddy Rajagopal Reddy: తగవుల దారిలో తమ్ముడు.. రేవంత్కు అండగా అన్న!
ABN , Publish Date - Aug 05 , 2025 | 04:21 AM
తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై అవకాశం దొరికినప్పుడల్లా విమరనాస్ర్తాలు సంధిస్తున్నారు.
రాజగోపాల్రెడ్డిలో మంత్రిపదవి దక్కలేదన్న అసంతృప్తి!
సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై తరచూ విమర్శలు
సోషల్ మీడియా జర్నలిస్టులపై రేవంత్ ఆగ్రహం
వ్యక్తం చేయడంపైన రాజగోపాల్రెడ్డి తీవ్ర అభ్యంతరం
వారిని గౌరవించాలని, అవమానించవద్దని సూచన
గతంలో పదేళ్లు నేనే సీఎం అన్న వ్యాఖ్యపైనా విమర్శలు
మళ్లీ రేవంతే ముఖ్యమంత్రి కావాలంటున్న మంత్రి కోమటిరెడ్డి
వెంకట్రెడ్డి.. గణపతి పూజ కూడా చేశానని వెల్లడి
పార్టీలో రేవంత్ జూనియర్ అయినా గౌరవిస్తానని వ్యాఖ్య
మునుగోడు/హైదరాబాద్/నల్లగొండ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై అవకాశం దొరికినప్పుడల్లా విమరనాస్ర్తాలు సంధిస్తున్నారు. మరోవైపు ఆయన సోదరుడు, మంత్రి కోమటి రెడ్డి సీఎంకు అండగా నిలుస్తున్నారు. మళ్లీ రేవంతే సీఎం కావాలని ఆకాంక్షించారు. అందుకోసం గణపతి పూజ కూడా చేశానని సోమవారం చెప్పారు. ‘‘ఓనమాలు రానోడూ యూట్యూబ్లో, సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ జర్నలిస్టులమని ప్రచారం చేసుకుంటున్నారు’’ అని రేవంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను రాజగోపాల్రెడ్డి పరోక్షంగా తప్పుపట్టారు. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేసే సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలని, అవమానించడం సరికాదంటూ రాజ్గోపాల్ రెడ్డి సోమవారం ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. తెలంగాణ సమాజం ఆకాంక్ష మేరకు సోషల్ మీడియా తొలి నుంచీ తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉందని ప్రశంసించారు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలని ప్రధాన మీడియాను ఎగదోయడం ముమ్మాటికి ‘విభజించి పాలించు’ పద్ధతేనని రాజగోపాల్రెడ్డి విమర్శించారు. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతుంటుందని భరోసా ఇచ్చారు. ఇదే కాక ఇటీవల రేవంత్.. ‘మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటాను’ అన్న వ్యాఖ్యలను రాజగోపాల్రెడ్డి విమర్శించారు. కాంగ్రె్సలో వ్యక్తి స్వామ్యం ఉండదని, సీఎం అభ్యరిని పార్టీ నిర్ణయిస్తుందన్నారు. సీఎం పదవిపై ఏకపక్షంగా ప్రకటనలు చేయడం పార్టీ విధానాలకు విరుద్ధమన్నారు.
రేవంత్కు వెంకట్రెడ్డి ఫోన్
సీఎం రేవంత్పై రాజ్గోపాల్రెడ్డి విమర్శలు గుప్పిస్తుంటే ఆయన సోదరుడు వెంకట్రెడ్డి సీఎంకు మద్దతుగా నిలిచారు. సోమవారం నల్లగొండ జిల్లా కేం ద్రంలో రూ.13 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని వెంకట్రెడ్డి ప్రారంభించాక సీఎం రేవంత్రెడ్డికి ఫోన్ చేశారు. ‘తెలంగాణకు మళ్లీ మీరే సీఎం కావాలి. మరోసారి మీరు సీఎం అయ్యేందుకు గణపతి పూజతోపాటు హోమం కూడా చేశా ను’ అని అన్నారు. భవనాన్ని మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ కూడా మంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘‘క్యాంపు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో కార్యకర్తలకు, ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేశారా..’’ అని మంత్రిని అడిగారు. దీనికి వెంకట్రెడ్డి సమాధానమిస్తూ 5వేల మందికి భోజనాలను ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ప్రారంభోత్సవం తర్వాత వెంకట్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రె్సలో తను, ఉత్తమ్కుమార్రెడ్డి సీనియర్లైనా జూనియర్ అయిన రేవంత్రెడ్డి పట్ల తమకు గౌరవం ఉందని చెప్పారు.
అసలు సినిమా ముందుంది..
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతితోపాటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలంతా జైలుకెళ్లడం ఖాయమని వెంకట్రెడ్డి అన్నారు. కాళేశ్వరం ఇంజనీర్ల వద్దనే రూ.కోట్లు దొరికాయని, ఇక కేసీఆర్, హరీశ్రావు వద్ద ఎన్ని కోట్ల రూపాయలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు. తాము అధికారంలోకి వచ్చి 20 నెలలే అయిందని, అసలు సినిమా ముందుందన్నారు. ఏపీలో బనకచర్ల ప్రాజెక్టు కట్టనిచ్చేది లేదని, శ్రీశైలం నుంచి ఏపీ నీటి దోపిడీని అడ్డుకొని, నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేసుకుంటామని వెంకట్రెడ్డి చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 119 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు. నల్లగొండలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు 9నెలల్లో పూర్తయ్యేలా చూస్తామన్నారు. విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం కేరళను తలదన్నేలా కృషి చేస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం
Read latest Telangana News And Telugu News