‘రాజీవ్ యువ వికాసం’ ఎప్పుడు?
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:28 AM
ప్రభుత్వ ఉద్యోగాలు లేవు.. ఉన్నా అరకొర ఉద్యోగాల్లో అవకాశాలు రావు.. ఆఖరుకు స్వయం ఉపాధి కల్పించుకుని పొట్ట పోసుకుందామన్నా ఆ అదృష్టమూ అందిరావడం లేదు అని నిరుద్యోగ యువతీ, యువకులు నిరాశ, నిస్పృహల్లో పడిపోతున్నారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ప్రభుత్వ ఉద్యోగాలు లేవు.. ఉన్నా అరకొర ఉద్యోగాల్లో అవకాశాలు రావు.. ఆఖరుకు స్వయం ఉపాధి కల్పించుకుని పొట్ట పోసుకుందామన్నా ఆ అదృష్టమూ అందిరావడం లేదు అని నిరుద్యోగ యువతీ, యువకులు నిరాశ, నిస్పృహల్లో పడిపోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీలకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఉద్యోగావకాశాలు దక్కని నిరుద్యోగ యువతీ, యువకుల్లో పెరుగుతున్న నిరాశను తొలగించి ఆర్థిక పరిపుష్టి సాధించే దిశగా అడుగులు వేయించాలని ప్రభుత్వం భావించింది. ఆయా కమ్యూనిటీలకు చెందిన కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి మూడు నెలల క్రితమే ఆ ప్రక్రియను పూర్తి చేసింది. దరఖాస్తుదారుల్లో ఎంత మందికి సహాయం అందించనున్నది, అర్హులకు అందించే సబ్సిడీని బ్యాంకులకు ఎప్పుడు పంపిస్తుంది, అసలు పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తుంది అనే విషయంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఫ పథకం ఇలా..
రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పించుకునే యువతీ, యువకులకు 50 వేల రూపాయల వరకు నూరుశాతం సబ్సిడీతో ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. 50,001 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు విలువచేసే యూనిట్ స్థాపించుకునేవారికి 90 శాతం సబ్సిడీ, 10 శాతం బ్యాంకులోను సమకూర్చాలని, 1,00,001 నుంచి రెండు లక్షల రూపాయల వరకు విలువచేసే యూనిట్ స్థాపించుకునేవారికి 80 శాతం సబ్సిడీ, 20 శాతం బ్యాంకు లోను, 2,00,001 నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు విలువచేసే యూనిట్ను సమకూర్చుకునేవారికి 70 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు లోన్ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పలు కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తులు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 13,354 దరఖాస్తులు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 991 దరఖాస్తులు, బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల ద్వారా 36,509 దరఖాస్తులు, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 4,859 దరఖాస్తులు, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 98 దరఖాస్తులు, ఈబీసీ కార్పొరేషన్ ద్వారా 2154 దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 57,965 మంది రాజీవ్ యువ వికాసం పథకం ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి 4,997 మందికి, ఎస్టీ కార్పొరేషన్ నుంచి 368, బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల ద్వారా 5,550, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 782, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 55, ఈబీసీ కార్పొరేషన్ ద్వారా 2,362 మందికి, మొత్తం 14,114 మందికి ఈ పథకం కింద జిల్లాలో ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దరఖాస్తులు స్వీకరించి నెలలు గడిచినా ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించకపోవడంతో నిరుద్యోగ యువతీ, యువకులను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మార్చి 17 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆ సమయంలో తహసీల్దార్ల నుంచి తీసుకున్న తాజా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జతపరచాలని ప్రభుత్వం చెప్పింది. వాటి కోసం నిరుద్యోగ యువతీ, యువకులు కార్యాలయాల చుట్టూ తిరిగారు. అదే సమయంలో సర్వర్ డౌన్ కావడంతో సర్టిఫికెట్ల జారీ ఆలస్యమయింది. ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి పలువురు తీసుకురావడంతో ఏప్రిల్ 14 వరకు గడువు పొడిగించింది. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసి రెండు నెలల 20 రోజులు పూర్తయింది. ప్రభుత్వం వీరికి ఆర్థిక సహాయం అందించే విషయంలో స్పందించడం లేదు.
జిల్లా స్థాయి కమిటీ అప్రూవ్ చేసినా..
తొలుత రాష్ట్ర ఆవిర్భావ దినమైన జూన్ 2న ఈ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు ఆర్థిక సహాయ పత్రాలు అందజేస్తారని ప్రచారం జరిగింది. ఎంతో ఆశతో ఉన్న యువతీ, యువకులకు ఆ రోజు అది ఆచరణకు నోచుకోకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. 50 వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం కోసం 1,514 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 1,412 మందికి జిల్లాస్థాయి కమిటీ అప్రూవ్ చేసిందని, 50,001 నుంచి లక్ష రూపాయల రుణం వరకు 2,786 మంది దరఖాస్తులు చేసుకోగా 1067 మందికి అప్రూవ్ చేశారని సమాచారం. ఈ రెండు కేటగిరీల కింద 2,581 మందికి జిల్లా కమిటీ అనుమతి ఇవ్వడంతో జూన్ 2న అందరికి మంజూరు పత్రాలు ఇస్తారని ఆశించారు. ఇప్పటి వరకు ఎవరికీ ఆర్థిక సహాయం అందలేదు. జిల్లావ్యాప్తంగా ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందడానికి 57,965 మంది దరఖాస్తులు చేసుకుంటే అందులో 25 శాతానికి సరిపడా 14,114 మందికి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. త్వరలోనే ప్రభుత్వం ఈ ఏడాదికి పెట్టుకున్న లక్ష్యం మేరకు ఆర్థిక సహాయం అందించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.