ఇసుక దందాకు చెక్ పెడతా
ABN , Publish Date - Jul 07 , 2025 | 12:37 AM
ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టి ప్రభుత్వ ఆదాయం పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కార్మిక, మైనింగ్శాఖ మంత్రి గడ్డం వివేక్ చెప్పారు. ఆదివారం రాత్రి గోదావరిఖని దుర్గానగర్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్హాల్లో మాల మహానాడు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వివేక్ పాల్గొన్నారు.
గోదావరిఖని, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టి ప్రభుత్వ ఆదాయం పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కార్మిక, మైనింగ్శాఖ మంత్రి గడ్డం వివేక్ చెప్పారు. ఆదివారం రాత్రి గోదావరిఖని దుర్గానగర్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్హాల్లో మాల మహానాడు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఇసుక అక్రమ రావాణా చేసేవారిని వదిలిపెట్టేది లేదని, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ.670కోట్ల ఆదాయం వస్తుందని, ప్రభుత్వ ఆదాయానికి గడి కొడితే సహించేది లేదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కూడా సీరియస్గా ఉన్నారని, ఇసుక రవాణా ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచే విధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించినట్టు వివేక్ చెప్పారు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చడం, సంస్థలోపని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు, దీనిపై సింగరేణి సీఎండీ బలరాంనాయక్తో మాట్లాడినట్టు చెప్పారు. సింగరణి సంస్థను కాపాడుకోవడం, డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధులు సింగరేణి ప్రభావిత గ్రామాల్లో ఉపయోగించడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. తాను ఎప్పుడూ పదవుల కోసం ఆశపడలేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో తనను మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి ఇబ్బందులకు గురి చేసినప్పటికీ ఉద్యమానికి నాయకత్వం వహించి ముందుకు నడిచానన్నారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ సింగరేణి కార్మికులకు పెన్షన్ పెంచాలని పార్లమెంట్లో గళం విప్పారని, దీంతో రూ.144కోట్లు కేటాయించారని చెప్పారు. గుమ్మడి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు బీ వెంకట్రావ్, బాబర్ సలీంపాషా, పీ మల్లికార్జున్, కామ విజయ్, తొగరి తిరుపతి, బోయిని మల్లేష్, దుబాసి మల్లేష్, బందారపు మల్లికార్జున్, పుట్ట రమేష్, వంగ లక్ష్మిపతిగౌడ్, పెంచాల తిరుపతి, ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, మడ్డి ఎల్లయ్య, వైవీరావు, రంగు తిరుపతి పాల్గొన్నారు. కార్మికశాఖ మంత్రిగా గోదావరిఖనికి వచ్చిన గడ్డం వివేక్కు మాల మహానాడు, కార్మిక సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ టీ జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీ మల్లికార్జున్, కామ విజయ్ ఆధ్వర్యంలో భారీ గజ మాలను వివేక్ వేశారు. మహిళలు మంగళహారతులతో, ఒగ్గు డోలు కళాకారులతో ర్యాలీ నిర్వహించారు.