న్యాయం చేయాలని బాధితుల నిరసన
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:20 AM
భూమి విక్రయం పేరుతోపాటు అక్కర నిమిత్తం తీసుకున్న లక్షలాది రూపాయల డబ్బులు తిరిగి ఇప్పించాలని రొంపికుంట గ్రామానికి చెందిన గుమ్మడి హైమవతి శ్రీనివాస్ ఇంటి ఎదుట పలువురు బాధితులు శుక్రవారం నిరసన తెలిపారు.
కమాన్పూర్, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): భూమి విక్రయం పేరుతోపాటు అక్కర నిమిత్తం తీసుకున్న లక్షలాది రూపాయల డబ్బులు తిరిగి ఇప్పించాలని రొంపికుంట గ్రామానికి చెందిన గుమ్మడి హైమవతి శ్రీనివాస్ ఇంటి ఎదుట పలువురు బాధితులు శుక్రవారం నిరసన తెలిపారు. గుమ్మడి శ్రీనివాస్ అనే వ్యక్తి 10 గుంటల వ్యవసాయ భూమి విక్రయం కోసం మూడేళ్ల క్రితం ఒకరి వద్ద రూ.21 లక్షలు తీసుకుని రిజిస్ర్టేషన్ చేయకపోగా, దానిని గతంలోనే మరొకరికి రిజిస్ర్టేషన్ చేసినట్లు తెలిపాడు. మరో బాధితుడు నాగారం గ్రామానికి చెందిన మాడిశెట్టి బాలకృష్ణ వద్ద 2011లో రూ.4 లక్షల అప్పు తీసుకొని ఇవ్వకుండా పలు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయాడు. అఫ్జల్ అనే బాధితుడు మాట్లాడుతూ 2014లో రూ.2.50 లక్షలు తీసుకొని ఇప్పటి వరకు ఇవ్వలేదని, రెండు గుంటల స్థలాన్ని రాసి ఇచ్చాడని తెలిపాడు. కాగా గుమ్మడి శ్రీనివాస్ తల్లి గుమ్మడి లక్ష్మితోపాటు ఆమె చిన్న కుమారుడు రామకృష్ణలు మాట్లాడుతూ రొంపికుంటలో ఉమ్మడిగా ఉన్న 7 ఎకరాల భూమిని సాగు చేసుకుం టామంటే ఇచ్చామని, శ్రీనివాస్ తమకు తెలియకుండానే అక్రమంగా పట్టా చేసుకున్నట్లు తెలిపారు. తాము ఒడిశా రాష్ట్రంలో ఉండటంతో భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న విషయం ఆలస్యంగా తెలిసిందని కుటుంబ సభ్యులు వాపోయారు. మరెవరు మోసపో వద్దని చెప్పడానికి తాము ఇక్కడికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు బాధితులు శుక్రవారం గుమ్మడి శ్రీనివాస్ ఇంటి ఎదుట వంటావార్పు చేసుకొని నిరసనలు తెలిపారు. తమకు న్యాయం చేయాలని అధికారులను, పోలీసులను బాధితులు కోరుతున్నారు.