నేడు ఇందిరా మహిళా శక్తి సంబరాలు
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:35 AM
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం ఉదయం 10 గంటలకు జరగనున్న ఇందిరా మహిళా శక్తి సంబరాలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరు కానున్నారు.
పెద్దపల్లి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం ఉదయం 10 గంటలకు జరగనున్న ఇందిరా మహిళా శక్తి సంబరాలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరు కానున్నారు. ఇక్కడ జరగనున్న సభకు పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన మహిళలు హాజరు కానున్నారని అధికారులు తెలిపారు.
వడ్డీ లేని రుణాల కింద జిల్లాలోని 8,993 స్వశక్తి మహిళా సంఘాలకు ప్రభుత్వం 9 కోట్ల 55 లక్షల రూపాయలు విడుదల చేసింది. వీటిని మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా నిర్వహించే సభలో కొన్ని మహిళా సంఘాలకు చెక్కులను పంపిణీ చేయనున్నారు. మహిళా బీమా పథకం కింద కొందరికి చెక్కులు అందజేయనున్నారు. అలాగే ఆర్టీసీలో జిల్లాలోని 9 మండలాల సమాఖ్యల నుంచి ఇప్పటికే అద్దె బస్సులను ఏర్పాటు చేశారు. తాజాగా పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు మరో ఐదు బస్సులను కొనుగోలు చేయగా, వాటిని మంత్రులు ఆరంబించనున్నారని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన సభ జరిగే కళాశాల మైదానాన్ని పరిశీలించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష సైతం సభా ఏర్పాట్లను పరిశీలించి ఆర్డీవో గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.