నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:46 PM
కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సింగరేణి జేఏసీ కార్మిక సంఘాల నాయకులు కొరిమి రాజ్కుమార్, తుమ్మల రాజారెడ్డి, మాదాసు రామమూర్తి, వడ్డేపల్లి దాస్ డిమాండ్ చేశారు.
గోదావరిఖని, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సింగరేణి జేఏసీ కార్మిక సంఘాల నాయకులు కొరిమి రాజ్కుమార్, తుమ్మల రాజారెడ్డి, మాదాసు రామమూర్తి, వడ్డేపల్లి దాస్ డిమాండ్ చేశారు. సోమవారం ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పారిశ్రామిక రంగాన్ని దేశంలో పెట్టుబడిదారులకు అప్పన్నంగా అప్పగించడానికి ప్రయత్నం చేస్తుందని, కార్మికులను రెక్కలు తెగిన పక్షులుగా మార్చి దోపిడీ శక్తులకు ఎదురు లేకుండా చేయడానికి చూస్తోందన్నారు. కార్మికవర్గం పోరాటాలు చేసి సాధించుకున్న 29కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. గతంలో ప్రభుత్వ కుట్రను గుర్తించి కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఈనెల 21 నుంచి నాలుగు లేబర్ కోడ్లను అమలోకి తీసుకువచ్చిందని, దీనిపై రాష్ట్ర, దేశ వ్యాప్త నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్టు చెప్పారు. నాయకులు మడ్డి ఎల్లయ్య, ఆరెల్లి పోషం, శంకరయ్య, సోహెల్, అజీం పాషా, తొడుపునూరి రమేష్, ఎంఏ గౌస్ పాల్గొన్నారు.