కనిష్ఠ స్థాయికి పడిపోతున్న ఉషోగ్రతలు
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:40 PM
జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఐదు రోజులుగా క్రమేపి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండటంతో చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలి పంజా నుంచి రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మంథని, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఐదు రోజులుగా క్రమేపి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండటంతో చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలి పంజా నుంచి రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చలిపులి దెబ్బతో ప్రజలంతా బెంబేలెత్తి పోతున్నారు. చలికి తోడు తెల్లవారుజామున పొగ మంచు కప్పి వేస్తుంది. దీంతో ఉదయం 7.30 గంటలైనా పొగతో రహదారి అగుపించడం లేదు. పగలు వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల వరకు నమోదు అవుతుండగా సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రజలు చలి మంటలు వేసుకొని వెచ్చదనం కోసం ప్రయత్నిస్తున్నారు. పగలు సైతం చలిగాలి వీస్తుంది. రాత్రి, తెల్లవారుజామున ప్రజలు చలి మంటలు కాగుతున్నారు. సాయంత్రం నుంచే స్వెటర్స్, ఉన్ని దుస్తులను ధరిస్తున్నారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు అత్యవసరం అయితేనే తప్ప దూర ప్రయాణాలు చేయడం లేదు. చలి తీవ్రతతో ప్రజలు రగ్గులు, దుప్పట్లను కప్పుకుంటున్నారు. చలి తీవ్రత క్రమేపి పెరుగుతుండటంతో అస్తమా వ్యాధిగ్రస్తులతోపాటు చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. చలి నుంచి రక్షించుకోవడానికి కుటుంబ సభ్యులు వారికి తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. తెల్లవారుజామున వివిధ గ్రామాల నుంచి కూరగాయలు, పాలను మార్కెట్కు తీసుకువచ్చే రైతులు, పేపర్ బాయ్స్, బస్టాండ్, ప్రధాన రహదారుల వెంట ఉన్న టీ స్టాల్స్, హోటళ్లు యజమానులు, మున్సిపల్ సిబ్బంది, గ్రామీణ ప్రాంతాల నుంచి కూరగాయలు, పాలు తీసుకువచ్చే వారు చలి ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నారు.
14డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
కళ్యాణ్నగర్, (ఆంధ్రజ్యోతి): వారం రోజులుగా చలి పంజా విసురుతోంది. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలకు పడిపోవడంతో మధ్యాహ్నం వేళలో కూడా చలి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. సాయంత్రం వేళల్లో చలి తీవ్రతతో రోడ్డు నిర్మానుశ్యంగా కనిపిస్తుండగా చలి తీవ్రతకు తట్టుకోలేక పలు కాలనీల్లో ప్రజలు చలి మంటలు వేసుకుంటున్నారు.