భూ భారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారం
ABN , Publish Date - May 07 , 2025 | 11:42 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్వోఆర్ చట్టం భూ భారతి తో గ్రామాలలో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన భూ భూరతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతు కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు మినహాయించి మిగిలిన అన్ని రకాల భూ సమస్యలకు భూ భారతి చట్టం పరిష్కారం చూపుతుందన్నారు.
సుల్తానాబాద్, మే 7: (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్వోఆర్ చట్టం భూ భారతి తో గ్రామాలలో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన భూ భూరతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతు కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు మినహాయించి మిగిలిన అన్ని రకాల భూ సమస్యలకు భూ భారతి చట్టం పరిష్కారం చూపుతుందన్నారు. భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాలన్నారు. భూముల విస్తీర్ణం, మార్పులు చేర్పులకు అవకాశం ఉందన్నారు. మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లు భూమికి భూ దార్ కార్డు అందిస్తామన్నారు. పెండింగ్ సాదా బైనామా పరిష్కారానికి భూ బారతి చట్టం సెక్షన్ 6 కింద ఆర్డీఓకు బాధ్యతలు అప్పగించిందని, గడిచిన 12 ఏళ్లలో సాదాబైనామా భూములు అనుభవంలో ఉన్న వారికి మాత్రమే దరఖాస్తులు పరిష్కారమవుతాయన్నారు. బాధితులు సంతృప్తి చెందకుంటే అప్పీలు కూడా చేసుకునే అవకాశం ఉందని, భూభారతి చట్టం ద్వారా పక్కాగా భూమి సరిహద్దులు నిర్ణయిస్తారన్నారు. వారసత్వం, వీలునామా ద్వారా భూమి పై హక్కులు సంక్రమిస్తే తహసిల్దార్ విచారణ జరిపి రికార్డులలో మ్యూటేషన్ చేస్తారని అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలి
దేశంలో ప్రస్తుతం యుద్దవాతావరణం ఉన్నందున ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే దుష్రచారం నమ్మవద్దన్నారు. గత ప్రభుత్వం ధరణి తో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, భూభారతి చట్టంతో ఆ ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ళు ఆర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ కేటాయిస్తామని, ఇది పేదల ప్రభుత్వమని పేదల కోసం ప్రభుత్వం ఏమి చేయాలో అన్నీ చేస్తుందన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ వేణు, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాశ్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ ,తహసిల్దార్ రాంచంద్రారావు, రైతులు ప్రజా ప్రతినిదులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
భూసమస్యల పరిష్కారం కోసమే భూభారతి
ఎలిగేడు, మే 7 (ఆంధ్రజ్యోతి): భూసమస్యల శాశ్వత పరిష్కారం కోసమే భూభారతి రెవెన్యూ చట్టమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. బుధవారం నర్సాపూర్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించి, రైతుల సందేహాలను నివృత్తిచేశారు. అర్జీలు సమర్పించేందుకు వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు. దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ, సత్వర పరిష్కారానికి కృషిచేయాలని తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా అనేక మంది పేద రైతులు ఇబ్బందులకు గురయ్యారన్నారు. వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని, భూభారతి చట్టం రైతులకు ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు. సన్నవడ్లకు రూ.500బోనస్ చెల్లిస్తామన్నారు. సీఎం చొరవతో సీడ్ కంపనీల యాజమాన్యాలు రైతులు చెప్పినట్లు నడుచుకునే స్థాయికి వచ్చారని, గతంలో కంటే క్వింటాల్ సీడ్ ధాన్యానికి రూ.2వేల నుండి 5వేల వరకు ఎక్కువ ధర యాజమాన్యాలు చెల్లిస్తున్నారని అన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. మంథని ఆర్డీవో సురేష్, తహసీల్దార్ యాకన్న, ఎంపీడీఓ భాస్కర్రావు, పీఏసీఎస్ చైర్మన్ గోపు విజయభాస్కర్రెడ్డి, నరహరి సుధాకర్రెడ్డి, తిరుపతి, సీనియర్ అసిస్టెంట్ స్వామి, జూనియర్ అసిస్టెంట్ అనిల్కుమార్, ఆర్ఐ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శులు అంజలి, లలిత, నాయకులు పల్లెర్ల వెంకటేష్గౌడ్, దుగ్యాల సంతోష్రావు, అర్షనపల్లి వెంకటేశ్వర్రావు, రైతులు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.