యూరియా కోసం పడిగాపులు
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:01 AM
నైరుతి నై అంటూ మొఖం చాటేసినా.. అల్పపీడనం వర్షాలు రైతులను మురిపించాయి. ఖరీఫ్ సాగుకు ఊపిరినిచ్చిన వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం సాగు వ్యవసాయ శాఖ అంచనాలకు చేరువైంది. జిల్లాలో పచ్చని పైర్లు రైతుల్లో ఆశలు పెంచుతుంటే యూరియా రైతులకు తండ్లాటగా మారింది. జిల్లాలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య యూరియాగా మారింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
నైరుతి నై అంటూ మొఖం చాటేసినా.. అల్పపీడనం వర్షాలు రైతులను మురిపించాయి. ఖరీఫ్ సాగుకు ఊపిరినిచ్చిన వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం సాగు వ్యవసాయ శాఖ అంచనాలకు చేరువైంది. జిల్లాలో పచ్చని పైర్లు రైతుల్లో ఆశలు పెంచుతుంటే యూరియా రైతులకు తండ్లాటగా మారింది. జిల్లాలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య యూరియాగా మారింది. వ్యవసాయ సహకార సంఘాలకు ఎరువులు వస్తున్నాయని తెలియగానే తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు క్యూలైన్లతో రైతులు పడిగాపులు పడుతున్నారు. నిలబడే ఓపిక లేక రైతులు చెప్పులు లైన్లో పెడుతున్నారు. మరోవైపు ఎరువుల కోసం రోడ్డెక్కి ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సహకార సంఘాలకు యూరియా రావడంతోనే పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేస్తున్న తీరు జిల్లాలో కనిపిస్తోంది. రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం యూరియా పంపిణీకి చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పంటల సాగుకు అనుగుణంగా యూరియా తెప్పిస్తున్నామని రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇస్తున్నారు.
ఫ ఇంకా రావాల్సింది 12,153 మెట్రిక్ టన్నులు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు వ్వవసాయ శాఖ యాక్షన్ ప్లాన్ ప్రకారం యూరియా 25370 మెట్రిక్ టన్నులు అవసరం అవుతుందని అంచనా వేశారు. గంభీరావుపేట మండలానికి 1940 మెట్రిక్ టన్నులు, ఇల్లంతకుంట మండలానికి 3850 మెట్రిక్ టన్నులు, ముస్తాబాద్ మండలానికి 2800 మెట్రిక్ టన్నులు, సిరిసిల్ల మండలానికి 600 మెట్రిక్ టన్నులు, తంగళ్లపల్లికి 2200 మెట్రిక్ టన్నులు, వీర్నపల్లికి 900 మెట్రిక్ టన్నులు. ఎల్లారెడ్డిపేటకు 2400 మెట్రిక్ టన్నులు, బోయినపల్లికి 2500 మెట్రిక్ టన్నులు, చందుర్తికి 2180 మెట్రిక్ టన్నులు, కోనరావుపేటకు 2400 మెట్రిక్ టన్నులు, రుద్రంగికి 1120 మెట్రిక్ టన్నులు, వేములవాడకు 920 మెట్రిక్ టన్నులు, వేములవాడ రూరల్ 1560 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని అంచనాలు వేశారు. జిల్లాకు ఇప్పటివరకు యూరియా 13217మెట్రిక్లు టన్నులు వచ్చింది. జిల్లాకు ఇంకా రావలసిన యూరియా 12153 మెట్రిక్ టన్నులు ఉంది.
ఫ జిల్లాలో 2.43 లక్షల ఎకరాలు వానాకాలం సాగు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానకాలం సీజన్లో 2,43,773 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వరి 1,84,860ఎకరాలు, పత్తి 49,760 ఎకరాలు, మొక్కజొన్న 1600 ఎకరాలు, కంది 1155 ఎకరాలు, పెసర 79 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు వేశారు. వ్యవసాయ శాఖ అంచనాలకు అనుగుణంగానే జిల్లాలో ఇప్పటివరకు 2,35,330 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో వరి 1,84,310 ఎకరాలు, పత్తి 46,485 ఎకరాలు, మొక్కజొన్న 3748 ఎకరాలు, పెసర 30 ఎకరాలు, కంది 660 ఎకరాలు ప్రధానంగా సాగు చేశారు. సాగు పనులు చివరికి చేరుకున్న దశలో రైతులను యూరియా కొరత రైతులను ఇబ్బందికి గురిచేస్తోంది.
జిల్లాలో ఇప్పటివరకు వానకాలం పాగు ఇలా..
మండలం మొత్తం వరి పత్తి
గంభీరావుపేట 18598 18500 85
ఇల్లంతకుంట 36970 24000 12000
ముస్తాబాద్ 23835 23000 530
సిరిసిల్ల 5623 4800 800
తంగళ్లపల్లి 21086 20100 870
వీర్నపల్లి 8300 8000 300
ఎల్లారెడ్డిపేట 21100 17500 3600
బోయినపల్లి 19167 12600 6400
చందుర్తి 21367 15100 6200
కోనరావుపేట 23140 18300 4800
రుద్రంగి 10964 5910 2200
వేములవాడ 10038 5200 4800
వేములవాడ రూరల్ 15142 11300 3800
------------------------------------------------------------------
మొత్తం 235330 184310 46385
------------------------------------------------------------------