సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రూ.10వేల పెన్షన్ ఇవ్వాలి
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:57 PM
సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ రూ.10వేలు ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. బుధవారం గోదావరిఖని వచ్చిన ఆయన మున్సిపల్ జంక్షన్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు

గోదావరిఖని, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ రూ.10వేలు ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. బుధవారం గోదావరిఖని వచ్చిన ఆయన మున్సిపల్ జంక్షన్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఆయన మాట్లాడుతూ 35ఏళ్ల క్రితం మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి బొగ్గుగని కార్మికుల కోసం పెన్షన్ ప్రవేశపెట్టారని, దానిని మూడేళ్లకు ఒకసారి సవరించాల్సి ఉందన్నారు. అలా చేయకుండా 35ఏళ్ల క్రితం నాటి పెన్షన్నే కొనసాగిస్తున్నారన్నారు.
నెలకు రూ.500, రూ.1000 పెన్షన్ వచ్చే రిటైర్డ్ కార్మికులు ఉన్నారని, వారికి న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీపీసీలో స్థానికులకే ఉపాధి కల్పించాలని, ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన ఉద్యోగాలు, నిధులు వారికే ఇవ్వాలన్నారు. మాతంగి కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా కాలుష్యం తోపాటు ప్లాంట్ పక్కనే ఉండడం వల్ల శబ్దాలతో ఇబ్బందులు ఎదుర వుతున్నాయని, ఈ అంశంపై తాను పార్లమెంట్లో లేవనెత్తితే కేంద్ర విద్యుత్శాఖ మంత్రి తనకు లేఖ రాశారని, అందులో మాతంగి కాలనీకి ఆర్అండ్ఆర్ ఇచ్చినట్టు చెబుతున్నాడన్నారు. వాస్తవాలను కేంద్రం ముందు ఉంచుతామని, మాతంగి కాలనీకి ఆర్అండ్ఆర్ వచ్చేలా ఒత్తిడి తెస్తామన్నారు.