మానేరుపై బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు
ABN , Publish Date - Jul 28 , 2025 | 11:43 PM
పెద్దపల్లి-భూపాలపల్లి జిల్లాల సరిహద్దుగా ఉన్న మానేరు నది పై రెండు బ్రిడ్జిల నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రెండు బ్రిడ్జిలు అందుబాటులో ఉండగా మరో రెండు నిర్మాణాలకు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు ఆదేశాల మేరకు మానేరు నదిపై రెండు వంతెనలను నిర్మించడానికి ఆర్అండ్బీ అధికారులు ప్రతిపాదించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, భూపాలపల్లికి రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది.
మంథని/మంథనిరూరల్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి-భూపాలపల్లి జిల్లాల సరిహద్దుగా ఉన్న మానేరు నది పై రెండు బ్రిడ్జిల నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రెండు బ్రిడ్జిలు అందుబాటులో ఉండగా మరో రెండు నిర్మాణాలకు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు ఆదేశాల మేరకు మానేరు నదిపై రెండు వంతెనలను నిర్మించడానికి ఆర్అండ్బీ అధికారులు ప్రతిపాదించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, భూపాలపల్లికి రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది.
బ్రిడ్జిల ప్రతిపాదనలు ఇలా...
భూపాలపల్లి జిల్లాతోపాటు కాళేశ్వరం మీదుగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు మరింత దగ్గర రవాణా సౌకర్యం కల్పించడానికి పార్టు-1లో మంథని మండలంలోని స్వర్ణపల్లి శివారులోని మానేరు నదిపై 1.08 కిలోమీటర్ల పొడవున ప్రతిపాదించారు. అలాగే పార్టు-2లో వెంకటాపూర్ శివారులో 950 మీటర్లు పొడవున, పార్టు-3లో ఆరెంద శివారులోని ఎస్సీ కాలనీ నుంచి 1.16 కిలోమీటర్ల పొడవున బ్రిడ్జి నిర్మాణానికి ఆర్అండ్బీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆరెంద వద్ద తొలుత బ్రిడ్జి నిర్మాణానికి రూ.130 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. మరింత అనువైన రవాణా కోసం స్వర్ణపల్లి, వెంకటాపూర్ శివారులోని మానేరు నదిపై బ్రిడ్జిల నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. అడవిసోమన్పల్లి వద్ద ప్రస్తుతం ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంటుండంతో ముందస్తుగా ప్రస్తుతం ఉన్న ఎడమ వైపు మరో వంతెన నిర్మాణం కోసం ఇంజనీరింగ్ అధికారులు రూ. 118 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు తయారు చేశారు. ఈ రెండు బ్రిడ్జిల నిర్మాణం కోసం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షలు నిర్వహించారు. మూడు ప్రతిపాదనల్లో ఉన్న బ్రిడ్జి నిర్మాణం త్వరలోనే అనువుగా ఉన్న స్థలంలో నిర్మాణానికి ఫైనల్ కానుంది.
ప్రస్తుత రవాణా సౌకర్యం
మంథని మండలంలోని అడవిసోమన్పల్లి వద్ద 1971లో మంథని నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న పీవీ నర్సింహారావు సీఎంగా పని చేసిన సమయంలో వంతెన నిర్మించారు. నాటి నుంచి ఉమ్మడి వరంగల్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వెళ్ళటానికి ఈ వంతెన ఉపయోగపడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సింగరేణి పారిశ్రామిక ప్రాంతంగా ఎదిగిన భూపాలపల్లితో రవాణా వ్యవస్థను పెంచడానికి మల్హర్-ముత్తారం మండలాల సరిహద్దుగా ఉన్న ఖమ్మంపల్లి వద్ద మానేరు నది పై బ్రిడ్జి నిర్మించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, హుజురాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, పరకాల, హన్మకొండ, వరంగల్ ప్రాంతాలకు వెళ్ళడానికి అనువుగా ముత్తారం మండలంలోని ఓడేడ్ వద్ద మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించనప్పటికి పలు మార్లు వరద తాకిడి గురై పిల్లర్లు కొట్టుకుపోయాయి. దీంతో ఇప్పటి వరకు ఆ బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగానే మిగిలిపోయింది.