ముందస్తు జాగ్రత్తలు మేలు..
ABN , Publish Date - Mar 09 , 2025 | 01:02 AM
జిల్లాలో ఇటీవల కేన్సర్ కేసులు పెరుగుతుండడంతో ముందస్తు జాగ్రత్తలతో వ్యాధిబారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో కేన్సర్ బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. దీంతో కేంద్రం ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)లో చేరింది.
జగిత్యాల, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇటీవల కేన్సర్ కేసులు పెరుగుతుండడంతో ముందస్తు జాగ్రత్తలతో వ్యాధిబారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో కేన్సర్ బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. దీంతో కేంద్రం ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)లో చేరింది. ఈ మేరకు 30 ఏళ్లకు పైబడిన వారిలో నోటి, రొమ్ము, సర్వైకల్ కేన్సర్ బాధితుల గుర్తింపునకు ఆశా కర్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి అనుమానితులకు పరీక్షలు చేస్తున్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా కేన్సర్ బాధితులను గుర్తిస్తున్నారు. ఆ తర్వాత జిల్లా కేంద్రానికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో పరీక్షల అనంతరం కేన్సర్ నిర్ధారణ అయితే చికిత్స ప్రారంభిస్తున్నారు. ఒకవేళ వ్యాధి తీవ్ర స్థాయిలో ఉంటే హైదరాబాద్లోని ఎన్ఎంజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, రీజనల్ కేన్సర్ సెంటర్కు పంపించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈనెల విడుదల చేసిన ఎన్సీడీ సర్వేలో జిల్లాలో 470 కేన్సర్ కేసులు నమోదైనట్లు వెల్లడైంది.
ఫఇంటింటికీ ఆలన మొబైల్ టీం
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పాలియేటివ్ (ఆలన) సెంటర్లో కేన్సర్ బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. వీరిలో కొందరు మంచానికే పరిమితమవుతున్నారు. ఇలాంటి వారికి ఇక్కడ ఉపశమనం కలిగించేలా సేవలందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆలన సెంటర్లో ఆరు పడకల సామర్థ్యం ఉండగా...ఇన్ పేషంట్, ఔట్ పేషంట్ సేవలే కాకుండా తీవ్రత ఆధారంగా బాధితుల ఇళ్లకు వెళ్లి కూడా చికిత్స చేస్తున్నారు. సెంటర్ సిబ్బంది ఆలన వాహనంలో వెళ్లి మందులు ఇస్తున్నారు. పరిస్థితి మరింత విషమిస్తే సెంటర్కు తీసుకొస్తున్నారు. మూడు సంవత్సరాల కిత్రం మొదలైన ఈ సెంటర్ ద్వారా జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల వారు సుమారు రెండు వేల మందికి ఇన్ పేషంట్, ఆరు వేల మందికి ఔట్ పేషంట్ సేవలందించారు. ఇప్పటివరకు సుమారు 18 వేల మందికి పైగా పరీక్షలు చేశారు.
ఫఎందుకీ పరిస్థితి..
కేన్సర్ బాధితుల సంఖ్య పెరగడానికి జీవన శైలిలో మార్పు, మారిన ఆహార అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, కాలుష్యం వంటివి కారణమని వైద్యులు చెబుతున్నారు. పలువురు మహిళలు కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉద్యోగాలు సైతం చేస్తున్నారు. దీంతో ఇంటా బయట ఒత్తిడితో తమ ఆరోగ్యంపై పెద్ధగా శ్రద్ధ చూపడం లేదని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే బాధితుల్లో అత్యధికంగా మహిళలు ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి. కేన్సర్ సోకిన విషయం గుర్తించకపోగా, ముదిరాక తర్వాత చేయించినా ఫలితం ఉండడం లేదని అంటున్నారు.
ఫనేరేళ్ల పీహెచ్సీ పరిధిలో అధిక కేసులు
జిల్లాలో కేన్సర్ బాధితుల్లో అత్యధికంగా నేరేళ్ల పీహెచ్సీ పధిదిలోని గ్రామాల్లో ఉన్నారు. నేరేళ్ల పీహెచ్సీ పరిధిలో 67 మంది కేన్సర్ బాధితులుండగా ఒడ్డేలింగాపూర్ పీహెచ్సీ పరిధిలో 51 మంది ఉన్నారు. అత్యల్పంగా కోరుట్ల శివారులోని అల్లమయ్య గుట్టు అర్బన్ పీహెచ్సీ పరిధిలో ఒక్కరు, జగిత్యాల ఖిల్లాగడ్డ అర్బన్ పీహెచ్సీ పరిధిలో ఇద్దరు, రాంవెల్ యూపీహెచ్సీ పరిధిలో ఇద్దరు కేన్సర్ బాధితులు ఉన్నారు.
జిల్లాలో కేన్సర్ బాధితుల వివరాలు..
ఓరల్ కేన్సర్... 87 మంది
బ్రెస్ట్ కేన్సర్...138 మంది
సర్వైకల్ కేన్సర్....64 మంది
ఇతర కేన్సర్లు...181 మంది
మొత్తం... 470 మంది