కష్టపడి పని చేసే వారికే పార్టీ పదవులు
ABN , Publish Date - May 07 , 2025 | 11:44 PM
పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికే పార్టీలో పదవులు దక్కుతాయని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధ్యక్షతన జిల్లాల్లోని మండల, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో బుధవారం సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి టౌన్, మే 7(ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికే పార్టీలో పదవులు దక్కుతాయని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధ్యక్షతన జిల్లాల్లోని మండల, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై డీసీసీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, సంగీతం శ్రీనివాస్ పరిశీలకులుగా హాజరయ్యారు. జాతీయ, రాష్ట్ర పార్టీ నియమావళి మేరకు గ్రామ, మండల, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల నియామకంపై పరిశీలకులు వివరించారు. వారు మాట్లాడుతూ 2017 నుంచి పార్టీకి సేవలందించిన వారికే అవకాశాలుంటాయని, క్రమశిక్షణ లేని కార్యకర్తలను పార్టీ నుంచి తొలగిస్తామన్నారు. కమిటీల ఎన్నికలకు తాము హాజరవుతామని, పూర్తి కాగానే జిల్లాస్థాయిలో బహిరంగ సభ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. జిల్లాల్లో ప్రశాంతంగా మంత్రి శ్రీధర్బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేస్తామని మక్కాన్ సింగ్ తెలిపారు. ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ మొదట గ్రామ స్థాయి కమిటీలను ఎన్నిక చేసి మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని, తద్వారా మెజారిటీ కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్టీకి సమయం కేటాయించి పని చేసేవారిని గుర్తించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి మేరకు సజావుగా కమిటీల నియామకం పూర్తి చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో బలమైన నాయకులను కమిటీల్లో ఎన్నిక చేస్తే రానున్న స్ధానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి సులువుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు రాష్ట్రానికి ఆదర్శంగా నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు. నాయకులు గోపగాని సారయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాష్ రావు, రామిడి తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి యాదవ్, దామోదర్ రావు, ఆరె సంతోష్, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మండల, పట్టణ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.