Share News

నగదు తరలింపుపై నజర్‌

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:55 AM

స్థానిక సంస్థల షెడ్యూల్‌ జారీ కావడంతో ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో అధికార యంత్రాంగం నగదు తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌ స్థానాలకు పోటీ చేయాలని భావించే ఆశావహులు, వారి బంధుమిత్రులపై నిఘా ఉంచింది.

నగదు తరలింపుపై నజర్‌

జగిత్యాల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల షెడ్యూల్‌ జారీ కావడంతో ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో అధికార యంత్రాంగం నగదు తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌ స్థానాలకు పోటీ చేయాలని భావించే ఆశావహులు, వారి బంధుమిత్రులపై నిఘా ఉంచింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్నందున వారి రాకపోకలు సహా బ్యాంక్‌ అకౌంట్లపైనా దృష్టి పెట్టింది. తనిఖీల్లో రూ.50 వేలకు మించి నగదు దొరికితే పోలీసులు స్వాధీనం చేసుకోనున్నారు. జిల్లా, మండల, గ్రామ సరిహద్దులు, ప్రధాన రహదారులపై పోలీస్‌ పికెట్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే తనిఖీ విభాగాలకు తహసీల్దార్లను నోడల్‌ అధికారులుగా నియమించింది. సరైన ఆధారాలు (వస్తు కొనుగోలు-అమ్మకాలకు సంబంధించిన రసీదులు) చూపిస్తే సరి, లేదంటే ఆయా నగదును స్వాధీనం చేసుకోనుంది. పెద్ద మొత్తంలో మద్యం కొనుగోళ్లు, సరఫరా, బంగారం, వెండి వస్తువులు, చీరలు, ఇతర వస్తు కొనుగోళ్లపైనా నిఘా పెంచారు. ఇప్పటికే ఆయా దుకాణాల యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నారు.

ఫ12 విభాగాలకు నోడల్‌ అధికారులు...

జిల్లాలో 20 జడ్పీటీసీ, ఎంపీపీ, 216 ఎంపీటీసీ, 385 పంచాయతీలు, 3,536 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార యంత్రాంగం పోలింగ్‌, కౌంటింగ్‌ కోసం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఇందుకు ఎన్నికల కమిషన్‌ 12 విభాగాలను ఏర్పాటు చేసింది. వీటికి ఒక్కో నోడల్‌ అధికారిని నియమించింది. పోలింగ్‌కు ఎంతమంది సిబ్బంది అవసరం, ఎక్కడ విధులు నిర్వర్తించాలి, ఓటింగ్‌లో ఎవరు పాల్గొనాలి, కౌంటింగ్‌లో ఎవరు పాల్గొనాలి తదితర పనుల పర్యవేక్షణకు మానవ వనరుల విభాగాన్ని ఏర్పాటు చేసింది. బ్యాలెట్‌ బాక్సులు ఎన్ని అవసరం, ఎలా సమకూర్చాలి, పోలింగ్‌ కేంద్రానికి ఎలా తరలించాలి, అటునుంచి స్ట్రాంగ్‌ రూమ్‌కు ఆ తర్వాత కౌంటింగ్‌ హాల్‌కు ఎలా తరలించాలి వంటి అంశాల పర్యవేక్షణకు బ్యాలెట్‌ బాక్సుల విభాగాన్ని ఏర్పాటు చేసింది. మెట్‌పల్లి డివిజనల్‌ పంచాయతీ అధికారి సుదర్శన్‌ను దీనికి నోడల్‌ ఆఫీసర్‌గా నియమించారు. సిబ్బందిని పోలింగ్‌ బూత్‌లకు తరలింపు అటు నుంచి మళ్లీ వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు వాహనాలను పెద్ద సంఖ్యలో సమకూర్చాల్సి ఉంది. ఇందుకు జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌ను నోడల్‌ ఆఫీసర్‌గా నియమించింది. సిబ్బందికి శిక్షణ, మ్యాన్‌పవర్‌ మేనేజ్‌మెంట్‌కు డీఈవో రామును, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగానికి జడ్పీ డిప్యూటీ సీఈవో నరేశ్‌ను నోడల్‌ ఆఫీసర్‌గా, బ్యాలెట్‌ పేపర్ల నిర్వహణకు జిల్లా సహకార అధికారి మనోజ్‌ కుమార్‌ను నోడల్‌ ఆఫీసర్‌గా, హెల్ప్‌లైన్‌, ఫిర్యాదుల విభాగానికి జిల్లా సంక్షేమ అధికారి బోనగిరి నరేశ్‌ను నోడల్‌ అధికారిగా, రిపోర్ట్స్‌, రిటర్న్స్‌ విభాగానికి జిల్లా పంచాయతీ అధికారి మదన్‌మోహన్‌ను నోడల్‌ ఆఫీసర్‌గా నియమించింది.

ఫఅభ్యర్థుల ఖర్చుపై నిఘా....

ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తుంటారు. వాహనాల ర్యాలీలు నిర్వహిస్తుంటారు. గ్రామాల పర్యటనకు వాహనాల వినియోగం, బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు సమకూర్చుకుంటారు. వీటితో పాటు వెంట తిరిగే కార్యకర్తలకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, మద్యం, మాంసాహారం సమకూర్చుతుంటారు. లెక్కకు మించి ఖర్చు చేసే వారిపై అధికార యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ఎంసీసీ మానిటరింగ్‌ నోడల్‌ ఆఫీసర్‌గా జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్‌ను, పరిశీలక విభాగం నోడల్‌ ఆఫీసర్‌గా జిల్లా మెప్మా అధికారి దుర్గపు శ్రీనివాస్‌గౌడ్‌ను నియమించారు. వీరంతా కలెక్టరేట్‌ కేంద్రంగా ఆయా పనులను పర్యవేక్షిస్తుంటారు.

ఫజిల్లాలో ఏడు చెక్‌పోస్టులు..

జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏడు పోలీసు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. జగిత్యాల-నిజామాబాద్‌ సరిహద్దు ప్రాంతమైన బండలింగాపూర్‌ గండి హనుమాన్‌, జగిత్యాల-నిర్మల్‌ సరిహద్దు మల్లాపూర్‌ మండలం ఒబులాపూర్‌, రాయికల్‌ మండలం బోర్నపల్లి, జగిత్యాల-సిరిసిల్ల సరిహద్దు కథలాపూర్‌ మండలం కలికోట, జగిత్యాల-కరీంనగర్‌ సరిహద్దు కొడిమ్యాల మండలం పూడూరు, జగిత్యాల-మంచిర్యాల సరిహద్దు ధర్మపురి మండలం రాయపట్నం, బీర్‌పూర్‌ మండలం కమ్మునూర్‌ ప్రాంతాల్లో పోలీసు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేస్తున్నారు.

ఎన్నికల నియమావళి పాటించాలి

-సత్యప్రసాద్‌, కలెక్టర్‌

ఎన్నికల ప్రవర్తన నియమావళిని అన్ని వర్గాలు పాటించాలి. జిల్లాలో ప్రశాంతంగా, పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నగదు తరలింపుపై నిఘా ఉంచాం. నిబంధనలు ఉల్లంఘించి నగదు తరలిస్తే చర్యలు తప్పవు.

పకడ్బందీగా తనిఖీలు

-అశోక్‌ కుమార్‌, ఎస్పీ

జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. అక్రమంగా నగదు తరలింపుపై నిఘా ఉంచాం. నిబంధనలకు విరుద్ధంగా నగదు తరలించొద్దు.

Updated Date - Oct 07 , 2025 | 12:55 AM