ఇందిరమ్మ ఇండ్లకు మహిళా సంఘాల ద్వారా రుణాలు
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:05 AM
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఇండ్ల నిర్మాణం కోసం మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం అందజేయాలని అధికారులను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం మండలంలో కలెక్టర్ విసృతంగా పర్యటించారు.
ధర్మారం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఇండ్ల నిర్మాణం కోసం మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం అందజేయాలని అధికారులను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం మండలంలో కలెక్టర్ విసృతంగా పర్యటించారు. ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరారు. పత్తిపాకలో నిర్మిస్తున్న ఇండ్ల పనులను పరిశీలించారు. అనంతరం అంగన్వాడి సెంటర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ఉన్నత పాఠశాలకు ర్యాంపు, అంతర్గత రోడ్డు, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. మల్లాపూర్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి పాఠశాలలో వంట గది సెక్షన్, డార్మెంటరీ మరమ్మతు పూర్తి చేయాలని చెప్పారు. పత్తిపాక, మల్లాపూర్, బంజేరుపల్లి, లంబడితండాల్లోని పాఠశాలను సందర్శించిన సమయంలో విద్యార్థులతో మాట్లాడారు. చదవడం, రాయడం, లెక్కలు చేయడంలో విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. ధర్మారంలోని గెస్ట్హౌస్, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాను కలెక్టర్ సందర్శించారు. మండల కేంద్రంలో కోటి 56 లక్షల రూపాయలతో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన పనులను పరిశీలించి పనులను 40 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, మండల పంచాయతీ అధికారి రమేష్, పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ రాజశేఖర్ సంబధిత అధికారులు ఉన్నారు.